AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

AP Liquor Scam Case: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని మైసూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మైసూరు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసేందుకు సిట్ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్ డైరెక్టర్. కాగా సుప్రీమ్ కోర్టులో గోవిందప్ప బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే నిందితులు ఇంత వరకు సిట్ కార్యాలయానికి చేరుకోలేదు. ఇప్పటికే వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.