Srikakulam: మృతి చెందాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. చివరికి లేచి కూర్చొవడంతో షాక్

Srikakulam: ఆ వృద్ధుడు చనిపోయాడుకున్నారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. చివరి చూపు కోసం అందరూ వచ్చేశారు. మరికొద్దిసేపట్లో శ్మశానానికి తరలిద్దామనేలోగా అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అంతే.. కుటుంబీలు, బంధువులు ఒక్కసా రిగా నివ్వెరపోయారు. ఈ ఘటన జి.సిగడాం మండలంలో జరిగింది.
శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం సీతంపేటకు చెందిన ధర్మవరపు అప్పారావు వయసు 85 ఏళ్లు. ఆయన వయసురీత్యా కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో.. కొద్దిరోజుల క్రితం అప్పారావును కుటుంబసభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
దీంతో ఇక అప్పారావు బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పటంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ఆంబులెన్స్ ద్వారా గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అప్పారావులో కదలిక కనిపించక పోవడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే తమ బంధువులకు సమాచారం ఇవ్వటంతో పాటు అంత్యక్రియలకు అన్నీ సిద్ధం చేశారు.
దీంతో గ్రామంలో ఉన్న వారు కట్టెలు, పూలదండలు, మేలతాళాలు రెడీ చేశారు. కొద్దిసేపట్లో శ్మశానానికి తీసుకెళతారనగా.. అప్పారావు ఒక్కసారిగా కళ్లు తెరిచి, కాళ్లు కదిలించాడు. కొద్దిసేపటికి ఆయన లేచి కూర్చోవడంతో అక్కడున్న జనాలంతా అవాక్కయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చోవడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.