పరిషత్ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమా?

Telangana: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు. బలహీన వర్గాల ఆశ, ఆశయాన్ని మేనిఫెస్టో రూపంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కారణాలు ఏమైనా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు వారు కోరుకున్న 42 శాతం రిజర్వేషన్లు అధికారికంగా లేకుండానే ఎన్నికలు జరిగిపోయాయి. అయితే ఆ క్షేత్రస్థాయిలో మాత్రం వారికిచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగా జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలువగలిగారు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రభుత్వం, ఆయా పార్టీలు, బీసీ సంఘాలు ఎవరెన్ని స్థానాల్లో గెలిచారనే లెక్కలు తీశాయి. పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాటా 86 శాతం అని తేలింది.
జనాభా ఎంతుందో అంత అన్నట్లు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పొలిటికల్ హక్కులు సాధించుకున్నారు బీసీలు. కొన్ని చోట్ల ఎస్సీలు సైతం ఓపెన్ కేటగిరిలో విజయం సాధించడం విశేషం. ప్రజాకాంక్షను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్దమైన హక్కుగా కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టులు ఒప్పుకోకుంటే రాజ్యాంగబద్దంగా ఎస్సీ ఎస్టీల మాదిరిగా జనాభా దామాషా రిజర్వేషన్లు సాధించాలని బీసీ సంఘాలు ఉద్యమ కార్యచరణ ముమ్మరం చేసేందుకు రెడీ అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కినా పార్టీల సింబల్పై నడిచే పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారిక 42 శాతం రిజర్వేషన్లు సాధించాలని బీసీ సంఘాలు ఉద్యమ కార్యచరణకు రెడీ అవుతున్నాయి.
ప్రభుత్వం శాసనసభ నిర్వహణకు సిద్దమవుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్షాలను కలిసి ఒప్పించేందుకు బలహీనవర్గాలకు చెందిన యూనియన్లు, నాయకులు వ్యూహం రచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడిన తర్వాత కృష్ణా, గోదావరి నీటి జలాలు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో చర్చ జరుగనుంది.



