తెలంగాణ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

తెలంగాణ 562 గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. మరో ఒక పోస్టును కోర్టు వివాదం నేపథ్యంలో విత్హెల్డ్లో పెట్టినట్లు పేర్కొన్నారు.
గ్రూప్-1లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్-10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారన్నారు. తుది ఎంపికలు హైకోర్టు తుదితీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు.
హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయింది. తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై.. ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది.
ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏక్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్-2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాపర్గా నిలిచారు. ఉస్మానియాలో వైద్యవిద్య పూర్తిచేసిన ఆమె.. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించారు. తుది ఎంపికలో ఆమె ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు. మల్టీజోన్-1 కేటగిరీలో టాపర్గా నిలిచిన హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాతపరీక్షల్లో 532 మార్కులు సాధించారు.
ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తాజా తుది ఎంపికలో ఆమెకు ఆర్డీవో పోస్టు లభించింది. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించి ఆర్డీవో పోస్టు సాధించారు.
జనరల్ మెరిట్ ర్యాంకు జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో ఆరుగురు, టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది, వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో 500పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్-3 ర్యాంకర్తో పాటు టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకు జాబితా ప్రకటించింది.
జీఆర్ఎల్లో మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేస్తూ టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఏప్రిల్ 16 నుంచి 22 వరకు చేపట్టింది. పరిశీలన సమయంలో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని, ఆ ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికలు పూర్తిచేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలు వెల్లడించింది.
గ్రూప్-1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21 వేల 85 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తరువాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కమిషన్ అప్పీలు చేయగా.. సింగిల్ జడ్జి తీర్పు అమలును హైకోర్టు నిలిపివేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలను వెల్లడించింది.



