మీడియా రాబందులు.. భర్త పిల్లలను లాగుతున్నారు: అనసూయ ఆవేదన

Anasuya Bharadwaj: శివాజీ వస్త్రధారణ వ్యాఖ్యల వివాదంలో అనసూయ మరోసారి స్పందించింది. మీడియా రాబందులు తన భర్త, పిల్లలను లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దుస్తుల ఎంపిక స్వేచ్ఛను కాపాడుతానని స్పష్టం చేశారు.
శివాజీ వ్యాఖ్యలపై అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో స్పందించారు. కొన్ని బాధ్యతారాహిత్య మీడియా సంస్థలు తన మాటలను వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు. ఇది టెక్స్ట్ బుక్ గ్యాస్ లైటింగ్ అని అభివర్ణించారు. తాను ఎవరికీ దుస్తులు ధరించమని చెప్పలేదని, ప్రతి మహిళ స్వేచ్ఛ ఉండాలని నమ్ముతానని స్పష్టం చేశారు.
తన దుస్తుల ఎంపికను అడ్డం పెట్టుకుని తన భర్త, పిల్లలను విమర్శించడం హేయమని అన్నారు. ఇది పితృస్వామ్య భావజాలం నుంచి వస్తోందని ఎద్దేవా చేశారు. విమర్శకులను తన అభిమానులుగానే లెక్కలోకి తీసుకుంటానని చురకలంటించారు. కీలుబొమ్మలుగా మారి ఇతరుల జీవితాలను విమర్శించవద్దని, స్వతంత్రంగా ఆలోచించాలని నెటిజన్లకు సూచించారు.



