ఆంధ్ర ప్రదేశ్

TTD: తిరుమలలో విశాఖ శారదా పీఠం మఠానికి షాక్.. ఖాళీ చేయాలని నోటీసులు

TTD: విశాఖ శారదా పీఠానికి టీటీడీ అధికారులు షాక్ ఇచ్చారు. తిరుమలలోని విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని మఠానికి నోటీసులు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యామ్‌ సమీపంలో ఉన్న విశాఖ శ్రీశారదా పీఠం భవనం ముందు, వెనుక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్ధీకరించింది.

దీనిపై ప్రజాసంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆ తర్వాత విశాఖ శారదా పీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదా పీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. టీటీడీ ఎస్టేట్‌ విభాగం అధికారులు విశాఖ శారదా పీఠానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతోపాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్‌ విభాగం నోటీసు జారీ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button