నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్

Revanth Reddy: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ట్యాంక్బండ్ వద్ద ప్రత్యక్షమయ్యారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా చేరుకున్న ఆయన, ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
ఆకస్మికంగా సీఎం ప్రత్యక్షం కావడంతో అక్కడి అధికారులు, పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. సాధారణ పౌరుడిలా వ్యవహరిస్తూ నిమజ్జన ప్రక్రియను దగ్గరగా పరిశీలించిన సీఎం రేవంత్, అధికారులను పలుమార్లు ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు.
భాగ్యనగర్ ఉత్సవ మండపం ఎక్కిన సీఎం రేవంత్ ప్రజలకు అభివాదం చేశారు. అయితే 46 ఏళ్లలో ఏ సీఎం కూడా ఇలా నిమజ్జనానికి రాలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చిన అందరినీ సడన్ సర్ప్రైజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవ మండపంపై నుంచి గణపతి పబ్బా మోరియా అంటూ స్లోగన్ ఇచ్చారు.
ప్రతి సంవత్సరం జరిగే గణేష్ నిమజ్జన వేడుకల్లో ట్యాంక్బండ్ కీలక కేంద్రంగా మారుతుంది. ఈసారి సీఎం స్వయంగా హఠాత్తుగా పరిశీలనకు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనను చూసిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతో కలసిపోయి నడుస్తూ, సాధారణ పద్ధతిలో ఏర్పాట్లను పరిశీలించడం ద్వారా సీఎం రేవంత్ తన సాధారణతను మరోసారి చాటిచెప్పారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.



