Nagababu: నాగబాబుకు మంత్రి పదవి వెనుక బిగ్ సీక్రెట్..

Nagababu: అనుకులంగా ఉన్నప్పుడు ఒకలా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలా ఎవరైనా వ్యవహరిస్తారు. కానీ ఎప్పుడూ ఒకలా వ్యవహరిస్తే అందువల్ల కలిగే లాభాలు ఎక్కువే ఉంటాయి. నష్టాలూ అలాగే ఉంటాయి. కానీ రాజకీయాల్లో ప్రతికూలత అనుకూలతగా మారుతుంది. అనుకూలత ప్రతికూలంగా మారుతోంది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకనేగా మీ డౌట్..? యూ ఆర్ రైట్..! ఏపీలో త్వరలో మెగా బ్రదర్ నాగబాబు కేబినెట్లో రాబోతున్నారు.
అయితే ఆయన కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక కూటమిలో బిగ్ డెసిషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం విషయంలో చర్చకు వచ్చిన పాయింట్ తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఆ రాజకీయమంతా జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ చుట్టూ తిరగబోతుందంటే ఇకా ఆశ్చర్యం కలుగుతుంది. అదెలా అనేగా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.
రాజకీయంగా చంద్రబాబు నాయుడు స్టైల్ దేశంలో ఇంకెవరికీ సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబుకు పగలుండవ్. ప్రతీకారాలుండవ్. ఆయన కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారు. రాజకీయంగా తనకు అనుకూలంగా ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించరు.
అలాగని ప్రతికూలంగా ఉన్నప్పుడు చతికిలపడిపోరు. ఆయన స్టైలే డిఫరెంట్. ఏపీలో త్వరలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కన్పిస్తోంది. మొదటి కేబినెట్లో సీనియర్లను కాదని చంద్రబాబు, జూనియర్లకు అవకాశం కల్పించారు. అలా ఎందుకు కల్పించారంటే అందుకో లాజిక్ కూడా పార్టీ నేతలు చెప్తారు.
లోకేష్ను వుడ్బీ సీఎంగా చేయాలనుకున్నప్పుడు అందరూ ఆయనతో కనెక్ట్ అయ్యేలా ఉండాలంటే అందుకు యువ నేతలు కేబినెట్లో ఉండాలన్నది లాజిక్. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ బతికి బట్టకడుతుందా అన్నట్టుగా జగన్ స్వైరవీహారం చేయడంతో జనసేనాని అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడికి, టీడీపీ నేతలకు ఆక్సిజన్ అందించారు. బీజేపీ చెంతకు టీడీపీని చేర్చి కూటమి గట్టి ఎన్నికల్లో అద్భుత విజయాన్ని దక్కేలా చేశారు. అందుకు ప్రతిఫలంగా జనసేనాని పవన్ కల్యాణ్కు డిప్యూటీ సీఎం, ఆ పార్టీ నేతలకు రెండు మంత్రి పదవులు లభించాయి.
గత ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబును అనకాపల్లి ఎంపీగా చేయాలని పవన్ భావించినా అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కాలేదు. ఇంకా ఇంకా ఏదో ఏదో అనుకున్నారు. కీలక కార్పొరేషన్ కు చైర్మన్ పదవి అన్న ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్తిదేనని.. అసలు కథ వేరే ఉందని తాజాగా తెలుస్తోంది. బీజేపీకి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒక అద్భుత శక్తిలా కన్పిస్తున్నారు. బీజేపీ వ్యూహాలను పవన్ కల్యాణ్ తో చేయించాలని కమలనాథులు భావిస్తున్నారు.
అదే సమయంలో టీడీపీ విషయంలోనూ బీజేపీ ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తోంది. గతంలో ఎక్కడైతే తాముదెబ్బతిన్నామో ఈసారి అక్కడ బలం పెంచుకోవాలని చంద్రబాబు అండ్ కో భావిస్తోంది. మోడీ తొలి టర్మ్లో విభేదాలతో దెబ్బతిన్న టీడీపీ ఈసారి అలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడుతోంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ ముఖ్యనేత, హోం మంత్రి అమిత్ షా తో సన్నిహితంగా అడుగులు వేస్తోంది టీడీపీ టీమ్.
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక, ఏపీలో కేబినెట్ ప్రక్షాళన చేసి ఒకరిద్దరిని పీకేస్తే పోలా అన్న భావనలో చంద్రబాబులో ఉన్నట్టు తెలుస్తోంది. అంచనాలకు దగ్గరగా పనిచేయలేకపోతున్న ఒకరిద్దరిని తొలగించి, కేబినెట్ ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి. కేబినెట్లో మరో మంత్రిని కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన కోటాలో ముగ్గురు మంత్రులున్నారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి వదులుకుంటే నాగబాబును మాత్రమే కేబినెట్ మంత్రిగా తీసుకుంటారా, లేదంటే మరొకరికి ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి.
నాగబాబును ఏపీ కేబినెట్లో తీసుకొని లోకేష్, పవన్ కల్యాణ్ మధ్య వార్ తగ్గించాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోకేష్ వర్సెస్ కల్యాణ్ అన్న అనవసర గందరగోళం లేకుంటే బెటరని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కూడా ఇబ్బందవుతోంది. ఇవన్నీ చంద్రబాబుకు తలనొప్పులు పెంచుతున్నాయ్. వచ్చే రోజుల్లో లోకేష్ కు ఎలివేషన్ ఇవ్వాలంటే అందుకు తగిన గ్రౌండ్ సిద్ధం కావాలి.
పవన్ కల్యాణ్ సీఎం స్థాయి వ్యక్తి. ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ కంటే, కేంద్ర మంత్రిగా ఉంటే విలువ ఎక్కువ ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. అప్పుడు పవన్ కల్యాణ్ ఇగో కూడా శాటిస్ ఫై అయ్యే అవకాశం ఉంటుందని టీడీపీ మేధావులు ఆలోచించారు. అందుకోసమే పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ను పార్లమెంట్ కు తీసుకెళ్తే పోలా అని వారందరూ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
అయితే ఇవాళ ఉన్న ఆలోచన వర్కౌటవుతుందో లేదో తెలియదు కానీ పవన్ కల్యాణ్ ను రాజ్యసభకు పంపించి కేంద్ర కేబినెట్లో తీసుకుంటారన్న చర్చ కూడావిపరీతంగా సాగుతోంది. ఇప్పటికే ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం ఖాళీగా ఉంది. అసలే పవన్ కల్యాణ్, విజయసాయిరెడ్డి క్లోజ్ అన్న చర్చ కూడా ఉంది. పవన్ కల్యాణ్ కోసమే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారా అన్న అనుమానాలకు కాలమే సమాధానం చెప్పాలి.
ఇక పవన్ కల్యాణ్ ను బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకునే ఆలోచనలో కమలనాథులున్నట్టు తెలుస్తోంది. తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ పవన్ కల్యాణ్ ను తిప్పాలని పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను దక్షిణాదిలో ఎక్కువగా ప్రచారంలో తిప్పాలని పార్టీ యోచిస్తోంది. అదే సమయంలో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి, ఇంకా ఇంకా ఏదో కొంత వెలితి ఉంది.
ఎన్నికల్లో ఉత్సాహం వస్తున్నా గెలుపు అంత తేలికవడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను వచ్చే గ్రేటర్ ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో తిప్పాలని కూడా కమలనాథుల భావిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టేలా చేస్తారు. తెలంగాణలో పాగా వేయడానికి మెయిన్ థీమ్ గా ఉంటుంది.
పవన్ కల్యాణ్ జనసేనలోనే కొనసాగుతూ కూటమిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ కాషాయ నేతలకు మించినట్టు అడుగులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి కాషాయధారిగా కన్పిస్తున్న పవన్ కల్యాణ్, ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకార వేళ కూడా ప్రధాని మోడీని ఎట్రాక్ట్ చేశారు. ఇక హిమలాయలకు వెళ్తారా అని మోడీ అడిగే అంతటి హిందుత్వవాదిగా పవన్ వచ్చే రోజుల్లో కూటమి రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం అన్న అభిప్రాయమూ ఉంది.
ఏపీలో నాగబాబుకు మంత్రి పదవి వెనుక ఉన్న అసలు స్టోరీ ఇదేనా అంటే వామ్మో అనుకోవాల్సిందే. పవన్ కల్యాణ్ ను ఢిల్లీ పిలిపించే కార్యాచరణ సిద్ధమైపోయిందనుకోవాలి. నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది ఇది సినిమాల్లో వర్కౌటవుతుంది గానీ రాజకీయాల్లో ఏమేరకు వర్కౌటవుతుందన్నది కాలమే నిర్ణయించాలి.