AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న రూ.3200 కోట్ల లిక్కర్ స్కాంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సిట్ ఇప్పటికే పలువురు నిందితుల్ని సైతం అరెస్టు చేసి విచారణ చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కేసును మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఏపీ మద్యం స్కాంను దర్యాప్తు చేసేందుకు వీలుగా ఇప్పటికే సేకరించిన దర్యాప్తు వివరాల పత్రాలను తమకు ఇవ్వాలంటూ సిట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ మేరకు సిట్ అధిపతిగా ఉన్న విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఓ లేఖ రాసినట్లు సమాచారం. దీంతో త్వరలో ఈ వివరాలను ఈడీతో కూడా పంచుకునేందుకు సిట్ సిద్దమవుతోంది. సిట్ నుంచి వివరాలు రాగానే ఈడీ ఈ కేసును మనీలాండరింగ్ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు చేయనుంది.
విజయవాడ సీపీకి రాసిన లేఖలో లిక్కర్ స్కాంపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తో పాటు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా కోరినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే సిట్ గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పీఏ పైలా దిలీప్ ను కూడా అరెస్టు చేసింది. వీరితో పాటు మాజీ సీఎం జగన్ కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మరో నిందితుడు గోవిందప్పను కూడా అరెస్టు చేసేందుకు సిద్దమవుతోంది. వీరికి సుప్రీంకోర్టు కూడా బెయిల్ తిరస్కరించడంత ో అరెస్టు కోసం సిట్ గాలిస్తోంది.
మరోవైపు లిక్కర్ స్కాం కేసులో మరో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడతాయని సిట్ అంచనా వేస్తోంది. అదే సమయంలో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తే వీరంతా అరెస్టు కావడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కాం డబ్బు విదేశాలకు చేరిపోయిందంటూ విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయబోతోంది.