ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు

ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. ఎంపీ కేశినేని శివనాథ్ భార్య జానకి లక్ష్మికి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తాజా సమన్లలో పేర్కొన్నారు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ కంపెనీతో సాగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో ఆమెకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ లాభాల్లో జానకి లక్ష్మికి కూడా వాటా ఉందనే బలమైన అనుమానంతో ఈడీ ఈ చర్యలకు తీసుకుంది.
గతంలో ఈ వ్యవహారానికి సంబంధించి జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం రాజకీయంగా, ఐటీ-కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ నెట్వర్క్, నిధుల మళ్లింపు ఎక్కడెక్కడ జరిగాయనే కోణంలో ఈడీ అధికారులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈనెల 27న జరిగే విచారణలో ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా ఈ కేసులో మరికొంత మంది కీలక నేతలు, వ్యాపారవేత్తలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. లోక్సభ ఎంపీ కుటుంబానికి ఈడీ సమన్లు జారీ కావడంతో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.



