Stock Market: బ్లాక్ ఫ్రైడే.. ఒక్క రోజులోనే 10 లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. గత ఐదు నెలలుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు లాబోదిబోమంటున్నారు. వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఢమాల్ అయ్యింది. ఎప్పుడు ఎందుకు పెరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎందుకు పడిపోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెసర్లు వెళ్లిపోవడంతో మార్కెట్లు తీవ్ర నష్టాలల్లోకి జరుకున్నాయి. ములిగే నక్కపై తాటికాయపడినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలలాడిపోతున్నారు.
గత వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 38.6 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మార్కెట్లు భారీగా పతనం కావడంతో మదుపర్లు రక్త కన్నీరు కారుస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు బ్లాక్ ఫ్రైడేగా మారింది. ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమవగా, ఆ తర్వాత మరింత పడిపోయాయి. సెస్సెక్స్ 1,414 పాయింట్ల వద్ద 73 వేల198 వద్ద ముగిసింది. 420 పాయింట్ల నష్టంతో 22వేల124 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఐటీ, టెక్, ఆటో, టెలికాం రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి.ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఒక్కరోజే మదుపర్లకు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల ప్రభావం మార్కెట్లపై పడుతోంది. తాజా ప్రకటనల ప్రకారం, మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే చైనాపై అదనంగా 10శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈయూపై 25శాతం సుంకాలు విధిస్తామన్న ప్రకటన కూడా మదుపర్లలో ఆందోళన పెంచుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదవ నెల కూడా పడిపోయింది. 1996 తర్వాత స్టాక్ మార్కెట్ వరుసగా ఐదు నెలలు క్షీణించడం ఇదే తొలిసారి.