తెలంగాణ

Janpahad Dargah: మత సామరస్యానికి ప్రతీకగా జాన్‌పహాడ్ దర్గా

Janpahad Dargah: మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. ఆ ప్రాంతానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఈ దర్గాకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ దర్గాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కుబడులను చెల్లించుకుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాన్‌పహాడ్ దర్గాపై రాజ్‌న్యూస్ ప్రత్యేక కథనం

సూర్యాపేట జిల్లాలోని జాన్‌పహాడ్ దర్గాకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ దర్గా ఉంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రతి సంక్రాంతి తర్వాత ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్నా అభివృద్ధిలో మాత్రం ముందుకు సాగడం లేదు.

ఈ దర్గా ముస్లింలకు సంబంధించిన స్థలమైన హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. దర్గాను మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. దర్గా వద్దకు వచ్చిన భక్తులు తాము కోరుకున్న కోరికలు తీరిన తర్వాత కందూరి పేరుతో తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు.

అయితే సరైన అభివృద్ధికి నోచుకోక ప్రాచుర్యంలో వెనుకబడిన ఈ దర్గాకు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది. సుమారు 400 ఏండ్ల క్రితం మద్రాసు రాష్ట్రంలో నాగూర్ గ్రామంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రచారం చేయాలని తలచాడు. ఈ మేరకు జాన్ పహాడ్, సైదా, వాజీద్ సైదా, మోయినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారనే కథ ప్రచారంలో ఉంది.

అయితే తప్పుడు సమాచారంతో వీరిపై వజీరాబాద్‌ పాలకులు యుద్ధానికి దిగారు. అందులో వీరంతా అమరులయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న వజీరాబాద్ పాలకుడు.. ప్రాయశ్చిత్తంగా జాన్‌పహడ్‌ సైదాకు దర్గా నిర్మించాడు. తర్వాత కాలక్రమంలో ఆ సమాధులు కాస్తా జానపహాడ్ దర్గాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

జానపహాడ్ దర్గా ఎంతో మహిమాన్వితమైందని ప్రజలు విశ్వసిస్తుంటారు. దర్గాకు కుడివైపున స్వయంగా వెలిసిన నాగుల పుట్ట వద్ద మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేసి ఉయ్యాల మొక్కు చెల్లించుకుంటే సంతానం కలుగుతుందని నమ్ముతుంటారు. ఇలా పిల్లలు కలిగిన వారు తమ సంతానానికి జానపహాడ్ సైదులు పేరు మీదుగా సైదులు సైదమ్మ అని నామకరణం చేస్తుంటారు.చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు చాల చోట్ల జానపహాడ్ సైదులు పేర్లు మనకు తారస పడుతాయి.


దర్గాకు వచ్చేవారికి మొదట సఫాయి బావి కనిపిస్తుంది. భక్తులు ఇక్కడి నుంచే తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బావి నీటితో వంట వండి సమర్పించడం అనవాయితీగా వస్తుంది. ఇది చాలా పవిత్రమైన బావిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని నమ్ముతారు. అలాగే పశుపక్ష్యాదులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటాయని, దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

జాన్‌పహాడ్‌ దర్గా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రతి ఏటా దర్గాకు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రతి శుక్రవారం భక్తులు కందూరు పేరుతో వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాలు శిథిలావస్థలో ఉండడంతో ఆరు బయట చెట్ల కింద వంటావార్పు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

తెలంగాణా రాష్ట్రంలో మతసామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతున్న జానపహాడ్ దర్గా ద్వారా ప్రతిఏటా భారీగా వస్తుంది. దర్గా వద్ద సౌకర్యాలు కల్పించడంలో వక్ఫ్ బోర్డు అశ్రద్ధ వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మొక్కులు తీర్చుకోవడడానికి వస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు రవాణా సౌకర్యాలు,నీటివసతి కల్పించాలని భక్తులు కోరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button