Raja Singh: కొత్త పార్టీ పెట్టే యోచనలో రాజాసింగ్..?

Raja Singh: బీజేపీలో కాంట్రవర్సీకి ఆయన కేరాఫ్ అడ్రస్. పార్టీ విధేయులుగా పేరున్న వ్యక్తి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తే పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారట. కాషాయ పార్టీకి రాంరాం చెప్పాలని డిసైడ్ అయ్యారట. పాత నేతలతో విసిగిపోయాడన్న టాక్ ఉంది. ఆ నేతల తీరువల్ల బీజేపీ అధికారంలోకి రాదన్న అంచనాకు సైతం వచ్చారట. ఇంతకీ పాత సీనియర్ నేతలను ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నారు..? పార్టీ నేతలపైన తీవ్ర విమర్శలు చేయడం వెనుక అంతర్యం ఏంటి..? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది..? అసలు అధిష్టానంపై అలకబూనిన ఆ నేత ఎవరు..? ఆ సీనియర్ నేతలెవ్వరు.?
బీజేపీలో సంచలనం కట్టర్ హిందుత్వ వాది రాజాసింగ్. కానీ ఇప్పుడు ఆయన కమలం పార్టీలో తీవ్ర అసంతృప్తితో రగిపోతున్నారట. బీజేపీ నుండి ఎవరు గెలిచినా గెలవకపోయినా రాజాసింగ్ మాత్రం కచ్చితంగా గెలుస్తారని కాషాయ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు. 2014 నుండి వరుసగా బిజెపి నుండి మూడుసార్లు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అతను రాజాసింగ్ ఏది మాట్లాడిన ఒక సంచలనమే అటు ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడమే కాకుండా సొంత పార్టీ నేతలను కూడా అటాక్ చేయడంలో తన రూటే సపరేటు. ఈ క్రమంలోనే తాజాగా సొంత పార్టీ నేతల పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారు రాజాసింగ్. చాలా రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు హిందుత్వ కార్యక్రమాల్లో పాల్గొని తన సత్తా చాటుతున్నారు.
ఈ మధ్యకాలంలో బీజేపీ జిల్లా అధ్యక్షులను అధిష్టానం ప్రకటించినప్పటి నుంచి రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారట. తన సొంత జిల్లాకు అధ్యక్షుడిని నియమిస్తే సీనియర్ ఎమ్మెల్యే అయి ఉంది కూడా తన అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. అప్పటి నుండి పాత సీనియర్ నేతల పై రాజసింగ్ విరుచుకు పడుతున్నారన్న టాక్ ఉంది.
పార్టీలో పాత సామాన్ ఉంది. ఆ పాత సామాన్ పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకుంటుంది. పాత సామాను బయటకు పంపించాలని పాత నేతలను ఉద్దేశించి మాట్లాడి సంచలంగా నిలిచారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక సమయంలో కూడా సమాచారం లేకుండానే అభ్యర్థిని ఎంపిక చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే.. పార్టీలో భజనపరులకే టికెట్లు ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజాసింగ్. తన ఎదుగుదలను రాజకీయంగా అణగదొక్కాలని సీనియర్లు తనపై కక్ష కట్టారని అనుచరుల వద్ద రాజసింగ్ పలు సందర్భాల్లో వాపోయాడట. పార్టీ బలోపేతం కావాలి తెలంగాణలో అధికారంలోకి రావాలనే ద్యాస పాత సీనియర్ నేతల్లో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీని అడ్డం పెట్టుకొని ఎదగాలని చూస్తున్నారు తప్ప అధికారంలోకి రావాలనే ఆలోచన లేదని.. పార్టీలో బలమైన నేత ఎవరైనా ఉంటే వారిని అనగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకొని ఆ పాత సీనియర్ నేతలు పనిచేస్తున్నారని రాజాసింగ్ ఫైర్ అవుతున్నాడట.
కొన్ని రోజుల క్రితం రాజాసింగ్ మరోసారి పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు వచ్చినా పాత సీనియర్ నేతలెవ్వరూ తనకు బర్త్డే విషెస్ చెప్పలేదని సన్నిహితుల దగ్గర ఆవేదన చెందారట. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు బర్త్డే విషెస్ చెప్పినా సొంత పార్టీలోని నేతలకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పే సమయం కూడా లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దాంతో చేసేది ఏమీ లేక ఆ పాత సీనియర్ నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారట.
అయితే.. వరుసగా మూడుసార్లు గెలిచిన తననే ఆ పాత నేతలు పట్టించుకోకపోతే… ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు రాజాసింగ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తనకు ఉందని… ఆ పాత సీనియర్ నేతలకు మాత్రం లేదని రాజాసింగ్ బహిరంగానే మండిపడుతున్నారు. తన మాటలను పరిగణలోకి తీసుకొని జాతీయ నాయకత్వం తెలంగాణ బిజెపిలో ఏం జరుగుతుందని ఆరా తీస్తే ఆ నాయకుల బాగోతాలు బయటపడతాయని సన్నిహితుల వద్ద చెపుతున్నారట రాజాసింగ్.
కమలం పార్టీలో ఆ నేతల ప్రభావం తగ్గించకపోతే తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయ్యారట. అందుకే పార్టీ సీనియర్ నేతలపైన తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయ్. దీన్ని జాతీయ నాయకత్వం సీరియస్ గా భావించి రాజసింగ్ పైన చర్యలు తీసుకుంటే ఒకవేళ పార్టీ నుండి సస్పెండ్ చేసినా రాజా సింగ్ కు ఎలాంటి ఢోకా లేదని వారి అనుచరులు చర్చించుకుంటున్నారు.
బీజేపీలో ఉంటే పాత నేతలే పెత్తనం చలాయిస్తారని కమలం పార్టీలో ఉండే బదులుగా కొత్త పార్టీ పెట్టండంటూ రాజాసింగ్ అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఒకవైల కొత్త పార్టీ పెట్టినా హిందుత్వ వాదంతో రాజాసింగ్ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారని ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే రాజసింగ్ వ్యూహాత్మకంగా పార్టీ నుండి సస్పెండ్ కావాలని పార్టీ నేతల పైన సంచలన కామెంట్స్ చేస్తున్నట్లు విమర్శలు ఎదురవుతున్నాయి.
ఒకవేళ పార్టీ సస్పెండ్ చేస్తే రాజా భాయ్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి..? ఏదైనా హిందుత్వ భావజాలం ఉన్న పార్టీలో చేరుతారా..? లేక కొత్త పార్టీ పెడతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.