ISRO: ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తైంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి .ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విజయంతో స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది.