పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు

మీ దగ్గర భారతీయ పాస్పోర్ట్ ఉందా? అయితే మీరు భారత పౌరులని గర్వంగా చెబుతుంటారా? కానీ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పాస్పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఇచ్చే ఒక డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి పూర్తి స్థాయి రుజువు కాదని కేంద్రం స్పష్టం చేసింది. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ వేడుకల సందర్భంగా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిన వారు, పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్పోర్ట్ను ఆధారంగా చూపవచ్చా అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వ్యాఖ్యలు చేసింది. సిద్ధాంతపరంగా చూస్తే పాస్పోర్ట్ కేవలం జాతీయతను సూచిస్తుందే తప్ప, అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కాదని అధికారులు స్పష్టం చేశారు.
అయితే, దీనిపై శివసేన యూబీటీ నేత ఆదిత్య థాకరే తీవ్రంగా స్పందించారు. పాస్పోర్ట్ ఇచ్చే ముందు పోలీసులు అన్ని వెరిఫికేషన్లు ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రకటన భారతీయ పాస్పోర్ట్ విశ్వసనీయతపై అనుమానాలు కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.



