Amit Shah: తెలంగాణలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. పొత్తులకు చెక్, రేవంత్కు కౌంటర్!

దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో అమిత్ షా పలు కీలక అంశాలపై షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖరాఖండిగా చెప్పారు. ఇకపై ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒంటిరిగానే పోటీ చేసి, సొంతంగా అధికారంలోకి రావాలనేది తమ పార్టీ అధిష్ఠానం లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలపై తమ ఫోకస్ మరింత పెరిగిందని, అక్కడ ఒంటరిగా బలపడటమే తమ తదుపరి అజెండా అని ఆయన వెల్లడించారు. పంజాబ్లో కూడా శిరోమణి అకాళీదళ్తో సహా ఏ పార్టీతోనూ పొత్తుల ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
ఇదే సమయంలో.. నియోజకవర్గాల పునర్ విభజన బిల్లుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అమిత్ షా తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో ఏమాత్రం సీరియస్నెస్ లేదని కొట్టిపారేశారు. పార్లమెంట్లో తగిన మద్దతు లభించగానే ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదిస్తామని ప్రకటించారు. ఈ విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, లోక్సభలో ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారమే అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించామని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు.. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేయబోతున్నామని హొంమంత్రి ప్రకటించారు. తెలంగాణ టార్గెట్గా, అలాగే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్గా అమిత్ షా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి.



