తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ నారాయణన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ డా.వి. నారాయణన్ తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 12న ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ- ‘సీ62 ఉపగ్రహ నమూనాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం నిర్విఘ్నంగా, విజయవంతంగా పూర్తి కావాలని ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇకపోతే 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టబోతున్న తొలి అంతరిక్ష ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీఎస్ఎల్వీ-సీ62 ఈఓఎస్-ఎన్1తో పాటు 8 విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించనుంది ఇస్రో. భూసంప్రేక్షణ, వ్యూహాత్మక అవసరాలకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.



