Emergency: దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు

Emergency: ఎమర్జెన్సీ. ఈ మాట అన్నా.. విన్నా.. 1975-77 మధ్య దేశంలో అధికారికంగా జరిగిన అనేక సంఘటనలు కళ్ల ముందుకు వస్తాయి. ఒకటా రెండా.. ఇలాంటివి అనేకం జరిగాయని నాయకులు రాసిన పుస్తకాలే కాదు చరిత్ర పరిశోధకులు రాసిన గ్రంధాల్లోనూ తెలుస్తాయి. రాజ్యాంగం అందరికి అన్నీ ఇచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించింది. ఇదే రాజ్యాంగంలో కీలకమైన 352 (1) ఆర్టికల్ ఎమర్జెన్సీని కూడా ప్రసాదించింది.
అయితే ఇది దుర్వినియోగం అవుతుందని కానీ ప్రజలను రాచి రంపాన పెడుతుందని కానీ నాటి రాజ్యాంగ కర్తలు ఊహించలేదు. ఇదే ఆనాటి ప్రధాని ఇందిరమ్మకు ఆయుధంగా మారింది. ఎమర్జెన్సీకి ప్రకటించిన ఆమె తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళనలు రేకెత్తించింది. రాజకీయ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలందరి జీవితాలలో అది చేదు సమయం. ఇంతకీ ఎమర్జెన్సీ ఎందుకు విధించారు..? దాన్ని వల్ల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి..?
1975 జూన్ 25న నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఏకపక్షంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించారు. దీంతో ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు అప్రకటిత నియంతృత్వం రాజ్యమేలి, 1977 మార్చి ఎన్నికలలో ఇందిర ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. అందుకే జూన్ 25ను భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు.
దీని కంటే ముందు దేశంలో రెండు సార్లు అత్యవసర పరిస్థితి విధించారు. తొలిసారి 1962లో చైనాతో యుద్ధం, 1971లో పాకిస్థాన్తో యుద్ధం సమయంలోనూ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అంతర్గత అలజడి పేరుతో ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదస్పదమైన నిర్ణయాల్లో ఈ అత్యవసర పరిస్థితి ఒకటి. ఇందిర సిఫార్సుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 (1)లోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకుని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25 అర్ధరాత్రి 11.45 నిమిషాలకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటితో 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మోదీ సర్కార్ ‘సంవిధాన్ హత్య దివస్’ జరుపుతోంది. ఈ సందర్భంగా ఆ నాటి రోజులను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జాతీయ అత్యవసర పరిస్థితిని భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించారు.
నాటి దురాగతాలను భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేరని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరించే ఓ పుస్తకం రానున్నట్లు ప్రధాని ప్రకటించారు. ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల 1975 నుంచి 1977 వరకు ఉన్న అవమానకరమైన కాలం గురించి నేటి యువతకు అవగాహన కలుగుతుందని ఎక్స్ వేదికగా కోరారు.
ఇదే విషయమై ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో తాను ఆర్ఎస్ఎస్లో యువ ప్రచారక్గా పనిచేస్తున్నానని చెప్పారు. అత్యయిక స్థితికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని అనుభవాలను మిగిల్చిందని తెలిపారు. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఉద్యమం పునరుద్ఘాటించిందన్నారు. అదే సమయంలో ఎంతోమంది రాజకీయ ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించిందన్నారు.
ఆ అనుభవాల్లో కొన్నింటిని సమీకరించి ‘బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్’ పుస్తక రూపంలో తీసుకొస్తోందని తెలిపారు. ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ అత్యయిక స్థితి నాటి రోజుల్లో తన ప్రయాణాన్ని వివరిస్తుంది. ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ముందుమాట రాశారు.
ఈ సందర్భంగా ఎమర్జెన్సీకి కారణమైన నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు గుప్పించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిన ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. దీన్ని ‘సంవిధాన్ హత్య దివస్’గా నేడు ప్రజలు గుర్తుంచుకోనున్నారన్నారు.
యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున భారత రాజ్యాంగ విలువలను పక్కన బెట్టి, ప్రాథమిక హక్కులను అణచివేసి, పత్రికా స్వేచ్ఛను కాలరాసి ఎంతోమంది రాజకీయ నేతలు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, సామాన్య పౌరులను జైలుకు పంపించారని విమర్శించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిర్బంధానికి గురిచేసిందన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించి వారు ప్రవర్తించిన తీరును భారతీయులెవరూ ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి ఒక్కరికీ మేం సెల్యూట్ చేస్తున్నాం. రాజ్యాంగ విధానాలను మరింత బలోపేతం చేసి వికసిత్ భారత్ను నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేస్తూ కొత్త శిఖరాలను అధిరోహిస్తామని మోదీ రాసుకొచ్చారు.
మరోవైపు మోదీ సర్కార్ రాజ్యాంగ హత్యా దినోత్సవం జరపుతుండడంపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ 11 ఏళ్ల పాలనను అప్రకటిత అత్యవసర పరిస్థితిగా అభివర్ణించింది. ఎమర్జెన్సీ సమయంలో కంటే మోదీ హయాంలో ప్రజాస్వామ్యం 5 రెట్లు ఎక్కువగా దాడికి గురైందని ఘాటు విమర్శలు చేసింది. మోదీ 11 ఏళ్ల పాలనలో హద్దులేని ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, పౌర స్వేచ్ఛను అణిచివేయడం జరుగుతోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
అలాగే మోదీ సర్కార్ తమను విమర్శించేవారిని దుర్భాషలాడుతోందని మండిపడ్డారు. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా ద్వేషం, మతతత్వాన్ని వ్యాపింపజేస్తోందన్నారు. నిరసన తెలుపుతున్న రైతులపై ఖలిస్థానీలు అని ముద్రవేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనను సమర్థించేవారిని అర్బన్ నక్సల్స్ అంటోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ హంతకులను కీర్తిస్తున్నారని జైరాం రమేశ్ విమర్శించారు. మైనారిటీలు తమ ప్రాణాలు, ఆస్తులు పోతాయేమోనని భయపడి జీవిస్తున్నారని అన్నారు. దళితులు, ఇతర అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారికి పదోన్నతులు లభిస్తున్నాయని అన్నారు. మోదీ హయాంలో రాజ్యాంగంపై దాడులు, పన్ను ఉగ్రవాదం, వ్యాపార, వాణిజ్య సంస్థలకు బెదిరింపులు, మీడియాపై నియంత్రణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం యథేచ్చగా కొనసాగుతోందని ఆరోపించారు. ఈ విధంగా దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని జైరాం రమేశ్ అన్నారు.
జూన్ 26వ తేదీ తెల్లవారుజామున రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సంతకంతో దేశంలో ఎమర్జెన్సీ అధికారికంగా అమల్లోకి వచ్చింది. పౌర హక్కులు సస్పెండ్ చేశారు, ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు, పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. ఈ ఎమర్జెన్సీ సుమారు 21 నెలల పాటు కొనసాగి, భారత రాజకీయాలపై చెరగని ముద్ర వేసింది.
అయితే ఈ ఎమర్జెన్సీలో నిందించాల్సింది ఇందిరను కాదు తన ఆలోచనని తన ఆలోచన చేసిన తప్పుని నేటికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా ఆలోచించాలి అంటే భయపడే విధంగా చేసింది. ఈ ప్రజాస్వామ్యం తను ఒక మహిళ అనే ఉద్దేశం చాలా మందికి ఉన్నప్పటికీ ఇప్పటికి ఎమర్జెన్సీని వాడుకోని రాజకీయం చేస్తున్నారు.