నేరం

‘తండ్రి ఉద్యోగం, ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములనే చంపిన మహిళ’- పల్నాడు పోలీసులు ఏం చెప్పారంటే..

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరచవచ్చు)

గుంటూరు జిల్లా బొల్లాపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గోపీకృష్ణ అకస్మాత్తుగా కనపడకుండా పోయారు.

తోటి వారికి ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. స్టేషన్‌లో సెలవూ అడగలేదు. చివరకు ఎస్సై మెమో జారీ చేశారు. అయినా గోపీకృష్ణ నుంచి సమాధానం లేదు.

ఏం జరిగిందంటే..

డిసెంబరు 12: పల్నాడు జిల్లా ముప్పాళ్ల బ్రాంచ్ కెనాల్ దగ్గర ఒక గుర్తు తెలియని మృతదేహం కాలువలో కొట్టుకువచ్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ మృతదేహం గుర్తుపట్టడానికి వీలుగా లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ దేహంపై ఉన్న బట్టలు, పోస్టుమార్టం తరువాత విస్రా (శరీర భాగం) దాచి ఉంచారు. ఆ శరీరం ఎవరిదనేది అప్పటికి పోలీసులకు తెలియలేదు.

డిసెంబరు 16: అదే పల్నాడు జిల్లా గోరంట్ల మేజర్ కాలువలో రెల్లు పొదలు బాగా పెరిగిపోయి ప్రవాహం వెళ్లకుండా కాలువ సన్నబడిపోయింది. అక్కడే తమకు మరో మృతదేహం దొరికే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం ఉండడంతో దాదాపు వంద మీటర్ల పొడవున చిన్న పడవలు వేసుకుని రెల్లు పొదలు తొలగిస్తూ గాలించారు. వారు అనుకున్నట్టే జరిగింది. ఆ రెల్లు పొదల మధ్య బాగా దెబ్బతిన్న మృతదేహం ఒకటి దొరికింది. కాలువలో ఆ పొదలు లేకపోయుంటే ఆ మృతదేహం దొరికేది కాదనుకున్నారు పోలీసులు.

ఈ రెండు సందర్భాల్లో దొరికిన రెండు డెడ్ బాడీలూ అన్నదమ్ములవి. వారిని చంపింది స్వయంగా వాళ్ల సోదరేనని, తండ్రి ఉద్యోగం, ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములను సోదరే స్వయంగా చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ హత్యలకు ఆమె మైనర్ అబ్బాయిల సాయం తీసుకున్నారని పోలీసులు చెప్పారు.

ఈ జంట హత్యల కేసులో నిందితులను సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు మంగళవారం (డిసెంబర్ 17) మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పల్నాడు జిల్లా నెకరికల్లులో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పల్నాడు జిల్లా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, నిందితురాలు కృష్ణవేణి నవంబర్ 26న తమ్ముడిని, డిసెంబరు 10న అన్నను హత్య చేశారు.

తండ్రి ఉద్యోగం, ఆస్తి కోసం..

నకరికల్లు గ్రామం యానాది కాలనీకి చెందిన తలపల కృష్ణవేణి తండ్రి టీచర్‌గా పనిచేస్తూ ఈ ఏడాది జనవరి 4న మరణించారు.

ఆయన భార్య అంతకుముందే చనిపోయారు. ఆయనకు ముగ్గురు సంతానం. కొడుకు, కూతురు, తరువాత మరో కొడుకు.

పెద్ద కొడుకు గోపీకృష్ణ పోలీస్ కానిస్టేబుల్. కుమార్తె కృష్ణవేణి. రెండో కుమారుడు దుర్గా రామకృష్ణ. వీరిద్దరికీ ఉద్యోగం లేదు.

వివిధ కారణాల వల్ల ఈ ముగ్గురూ తమ జీవిత భాగస్వాములకు దూరంగా ఉంటున్నారు. కానిస్టేబుల్ గోపీకృష్ణ భార్యతో విభేధాలు ఉన్నప్పటికీ పూర్తిగా విడిపోలేదని పోలీసులు అంటున్నారు. చిన్న కొడుకు రామకృష్ణ, కూతురు కృష్ణవేణి మాత్రం తమ భాగస్వాములతో విడిపోయారు. కృష్ణవేణి కొంత కాలంగా పుట్టింట్లో ఉంటున్నారు.

డీఎస్పీ ఎం.హనుమంతరావు వెల్లడించిన వివరాల ప్రకారం, తండ్రి మరణంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల కోసం కృష్ణవేణికి, సోదరులకు మధ్య గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో సయోధ్యకు ప్రయత్నించినా కుదరలేదు. దాంతో, సోదరులను అడ్డు తొలిగించుకుంటే డబ్బులు, ఉద్యోగం తనకే వస్తాయని కృష్ణవేణి ఆలోచన చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

ఈ విషయం ప్రియుడు దానయ్య, కృష్ణవేణి ఇద్దరు మాట్లాడుకొని ఆమె అన్నదమ్ములను చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమయ్యే డబ్బులు, మోటారు సైకిల్ ఇస్తానని దానయ్య చెప్పారు. తన తమ్ముడు దుర్గా రామకృష్ణను చంపితే రూ.10 వేలు ఇస్తానని గత నెల 26న నకరికల్లుకు చెందిన ఇద్దరు మైనర్ యువకులతో కృష్ణవేణి బేరం కుదుర్చుకున్నారు. అదే రోజు రాత్రి పదిన్నర సమయంలో వాళ్ల ఇంటి వద్దనే రామకృష్ణకు మద్యం తాగించి, తర్వాత చున్నీని గొంతుకు బిగించి చంపారు.

రామకృష్ణ శవాన్ని దానయ్య మోటారు సైకిల్‌పై అక్షర స్కూల్ వద్ద గోరంట్ల కాలువలో పడేసినట్లు నిందితురాలు చెప్పారు.

అలాగే, ఈ నెల 10న రాత్రి పదకొండున్నర సమయంలో మరో ఇద్దరు మైనర్లతో కలసి అన్న గోపీకృష్ణను కూడా చంపారు కృష్ణవేణి. దానయ్య మోటారు సైకిల్‌పై శవాన్ని తీసుకెళ్లి గుంటూరు బ్రాంచి కెనాల్‌లో పడేశారు.

ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన విధానం అత్యంత ఆశ్చర్యం కలిగించింది.

”క్రమంగా ఒక్కొక్కరు తన అన్నదమ్ముల గురించి ఆరా తీయడం వల్ల కావచ్చు. తాను తప్పు చేశాను, దొరికిపోతాను అన్న అనుమానం కావచ్చు. కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మిస్ అవడం వల్ల పెరిగిన విచారణ వలన కావచ్చు. నిందితురాలే స్వయంగా ఆ గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర నిజం ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను ప్రశ్నించి కేసు విచారిస్తున్నారు. విచారణ పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు” అని బీబీసీతో పల్నాడు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button