Kavitha: శాసనమండలిలో కంటతడి పెట్టుకున్న కవిత..!

Kavitha: ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించారు. మాట్లాడుతున్న సమయంలో ఆమె కంటతడి పెట్టారు. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితోనే తాను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చానని చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, పార్టీలో ప్రశ్నిస్తే కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో ఉండగా అనేక రకాల కట్టుబాట్లు, ఒత్తిళ్లు ఎదురయ్యాయని వెల్లడించారు. అయితే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, తనపై నమ్మకం ఉంచిన నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను సభ ముందు ఉంచుతూ, ప్రజాసేవే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని కవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్లో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశానని కవిత తెిపారు. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీ తనను ఘోరంగా అవమానించిందన్నారు. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టిందన్నారు.
పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించానని కవిత తెలిపారు. అమరువీరుల స్తూపం మొదలు.. కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అమరవీరులను బీఆర్ఎస్ ఎప్పుడూ గుర్తించలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలనూ పట్టించుకోలేదన్నారు.
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం తనకు అవమానకరం అన్నారు. కాళేశ్వరం విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు. అందుకే ప్రెస్మీట్ పెట్టి బలంగా మాట్లాడానన్నారు.



