ఆంధ్ర ప్రదేశ్

చెత్త నుంచి సంపద సృష్టి అంటే ఇదే!.. చైనా మోడల్ ఫాలో కానున్న ఏపీ

వ్యర్థాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్ వేసింది. చెత్త నుంచి సంపద సృష్టించాలనే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు, మంత్రిత్వశాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడేళ్లలో అమరావతి పనులను పూర్తిచేస్తామని మంత్రి ప్రకటించారు. సీఆర్డీఏ సమావేశాల్లో ఇప్పటి వరకూ 45 వేల కోట్ల రూపాయల పనులకు అనుమతి ఇచ్చామన్న నారాయణ.. వచ్చే ఏపీ కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోదం లభిస్తుందని చెప్పారు.

ఆంధ్రుల కలల రాజధాని అయిన అమరావతి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.62 వేలకోట్లు అని మంత్రి నారాయణ తెలిపారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ.. అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్లు, వంద ఎకరాల్లో అసెంబ్లీ భవనం, హైకోర్టు, అధికారుల నివాసాలు, రోడ్లు పూర్తిచేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకువస్తామన్న నారాయణ.. చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యర్థాల నిర్వహణను గాలికి వదిలేసిందని నారాయణ విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button