తెలంగాణ

BRS: ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ

BRS: పద్నాలుగేండ్ల ఉద్యమప్రస్థానం పదేండ్ల పాలన మేళవింపు.. తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గులాబీ దళపతి సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యే ఉద్యమాల పోరుగడ్డ నుంచే సమరభేరీ మోగించనున్నారు. ఇంతకీ ఎక్కడీ సభ..? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు..?

బీఆర్‌ఎస్‌ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్‌ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానున్నది. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్‌, లక్ష్మీ నియోజకవర్గంగా పిలుచుకునే హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎల్కతుర్తి ఈ మహాసభకు వేదిక అవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది జనాలు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండే ఎల్కతుర్తిని మహాసభ వేదికగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు.

60 ఏండ్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్‌లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల సుపరిపాలన మేళవింపుగా ఏప్రిల్‌ 27న ఎల్కతుర్తి వేదికగా బీఆర్‌ఎస్‌ రజతోత్సవ మహాసభ జరుగుతున్నది. భారీ బహిరంగసభలు అంటేనే బీఆర్‌ఎస్‌ అని దేశ రాజకీయాల్లో ఒక నానుడి ఉన్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగసభలు ప్రపంచ రికార్డులను నమోదు చేశాయి. ఈ క్రమంలోనే ఎల్కతుర్తి.. హనుమకొండ జిల్లాలోని ఉన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది.

ఉమ్మడి వరంగల్ , కరీంనగర్ , సిద్దిపేట జిల్లాలకు ఈ ప్రాంతం మధ్యలో ఉంటుంది. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ మరో కుంభమేళాలా తలదన్నే విధంగా ఉండేందుకు భారీగా జన సమీకరణ చేయనున్నారు. అందుకు సిద్దిపేట, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఈ సభకు ప్రజలను తరలించడానికి సైతం ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఎల్కతుర్తిలో 1వేయి 214 ఎకరాలు విశాలమైన స్థలం ఉండడంతో.. 150 ఎకరాల్లో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మిగిలిన 1000 ఎకరాల్లో పార్కింగ్ కు కేటాయించనున్నారు. కాగా.. ప్రస్తుతం ఎండలు మండిపోతుండగా బీఆర్ఎస్ సభ నిర్వహించే నాటికి మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సభలో జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. బహిరంగ సభకు తరలివచ్చే జనాల కోసం 10 లక్షల వాటర్ బాటిళ్లు తెప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాంతో పాటు మరో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా సభా స్థలంలో పంపిణీ చేయనున్నారు.

ఇక… సభకు తరలివచ్చే వెహికిల్స్ కోసం రూట్ మ్యాప్‌ను ఖరారు చేస్తున్నారు. ఆర్టీసీ వెహికిల్స్ తోపాటు ఇతర వాహనాలు కలిపి 40 వేల నుంచి 50 వేల వరకు తరలి రావచ్చని అంచనా వేస్తుండగా.. దానికి అనుగుణంగా పార్కింగ్ ఏర్పాట్లు చూస్తున్నారు. సభ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అనుమతుల కోసం ఇప్పటికే కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు పార్టీ నేతలంతా కలిసి వినతి పత్రం అందించారు.

పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతుండటంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. రజతోత్సవ సభను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 10 లక్షల భారీ జన సమీకరణను టార్గెట్ పెట్టుకోగా.. వచ్చే జనానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలన్న అధిష్ఠానం ఆదేశం మేరకు నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి ట్రబుల్ షూటర్ హరీష్ రావు నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పటి నుంచే కార్యచరణ ప్రారంభించనుంది బీఆర్ఎస్.

బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ హోదాలో పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో… భారీగా జన సమీకరణతో పాటుగా రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు కేసీఆర్ నాయకులకు , కార్యకర్తలకు ఒక దిశ నిర్దేశం చేస్తారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పరిస్థితులు , ఇవాళ పార్టీ పరిస్థితినీ వివరించనున్నారు కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు, అవలంభిస్తున్న తీరు పైన కేసీఆర్ విరుచుకుపడే అవకాశం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button