Revanth Reddy: ఓయూకు రావాలంటే ధైర్యం కాదు.. అభిమానం ఉండాలి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓయూ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు. విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే సంకల్పంతో వచ్చినట్టు తెలిపారు.
తెలంగాణలో ఎన్నో పోరాటాలు ఆధిపత్యానికి వ్యతిరేకంగానే జరిగాయని అన్నారు. నిజాం, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి సాధారణ ప్రజలు దొరలపై యుద్ధం చేసిన సంగతిని పునఃస్మరించారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగలేదనే భావనతో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిన శక్తి కూడా ఉస్మానియా విద్యార్థులేనని గుర్తు చేశారు.
పోరాడి సాధించిన రాష్ట్రంలో ప్రజల ఆశలు నెరవేరాయా లేదా అన్న విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఓయూ వచ్చానని సీఎం స్పష్టం చేశారు. “ఓయూకి వెళ్లే ధైర్యం ఎలా చేశావంటూ అనేక మంది నన్ను అడిగారు. కానీ ఓయూకు రావాలంటే ధైర్యం కాదు, అభిమానం కావాలని చెప్పారు. భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలకు దారి చూపించేందుకు, ఓయూను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చానని రేవంత్రెడ్డి తెలిపారు.



