తెలంగాణ

TGSRTC: ఎక్కే బస్సు ఎక్కడుందో తెలియట్లేదా? ఇలా తెలుసుకోండి..

TGSRTC: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మొత్తం 10వేల కిలోమీటర్ల రోడ్లుండగా, అందులో ప్రధాన 2వేల కిలోమీటర్లపై సిటీ బస్సులు కనిపిస్తుంటాయి. ఆ రోడ్లపై జీహెచ్‌ఎంసీ దాదాపు 1,500 బస్టాపులను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ఆ రహదారులపై దాదాపు 3వేల సిటీ బస్సులు నడుపుతోంది. రోజూ సుమారు 20 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. మెట్రో స్టేషన్ల కింద ఉండే బస్టాపులు అదనం. దాదాపు ఏడేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ఆయా బస్టాపులను నిర్మించింది.

తెలంగాణలో ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటికే చాలా బస్టాపులు అసౌకర్యాలతో ప్రయాణికులకు నరకం చూపుతున్నాయి. దీంతో ఆధునిక డిజైన్లతో బస్టాపులను పునరుద్ధరించాలని, లండన్‌ నగరంలో మాదిరి హైటెక్‌ హంగులతో కూడిన షెల్టర్లను కట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం కసరత్తు చేస్తోంది. బస్సుల కోసం బస్టాపుల్లో ఎదురు చూస్తోన్న ప్రయాణికులకు సమయం, దూరం వంటి వివరాలను తెలిపే డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

నగరంలోని అన్ని బస్టాపుల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేసి, బస్సుల్లోని జీపీఎస్‌తో అనుసంధానం చేసేందుకు ఆర్టీసీ సంస్థతో చర్చలు పూర్తయినట్లు జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఈ విధానం పీపీపీ పద్ధతిలో ఉండనుంది. ప్రకటనల ద్వారా ఏజెన్సీకి వచ్చే ఆదాయంతోనే.. డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేసి, బస్సులు, బస్టాపులను అనుసంధానం చేసేలా నిబంధన పెడతామని చెబుతోంది. బోర్డుల కొనుగోలు, వాటి నిర్వహణ, సాఫ్ట్‌వేర్‌ తయారీ ఖర్చులన్నీ ప్రైవేటు సంస్థ భరించాలని అధికారులు చెబుతున్నారు.

ఆధునికీకరణలో భాగంగా 248 కొత్త బస్టాపులు ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. దీంతో ఇప్పుడు మొత్తం 1432 బస్ స్టాపులు తయారయ్యాయి. ఇక సిటీ బస్సులు రోజూ 2800 నడుస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అడుగులు వేస్తుంది రేవంత్ ప్రభుత్వం. ప్రయాణికులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఆధునిక పరికరాలతో సౌకర్యాలు కలిగిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button