Stampede: ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 50 మందికి తీవ్రగాయాలు

Stampede: గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్లోని లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లైరాయ్ ఆలయంలో శుక్రవారమే వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే’ ఆచారంలో ఇవాళ వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది.
భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.