భద్రాద్రి సీతమ్మ అమ్మవారికి బంగారు చీర

Bhadradri: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారయింది. చేనేత మగ్గంపై సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు చీరను అత్యంత ప్రత్యేకంగా తయారు చేశాడు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాములకు సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి.
సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు హరిప్రసాద్ శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భద్రాద్రి సీతమ్మవారికి బంగారు పట్టు చీరను నేశాడు. ఈ చీర కొంగులో భద్రాద్రి దేవాలయం, మూల విరాట్, దేవతామూర్తులను వచ్చే విధంగా చీర క్రింది బార్డర్ లో శంఖు, చక్ర నామాలు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించాడు.
ఈ చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51వ సార్లు వచ్చే విధంగా నేయడం విశేషం. చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించి, ఎనిమిది వందలపైగా గ్రాముల బరువు గల ఏడు గజాల బంగారు చీర తయారు నేశాడు. ఇప్పటికే ఇలాంటి అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ చీరను భక్తి, శ్రద్ధతో నియమ నిష్ఠలతో తయారు చేశాడని తెలిపాడు. ఈ చీర నేయడానికి సుమారు పది రోజుల పాటు శ్రమించి నట్లు హరిప్రసాద్ తెలిపాడు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి, దేవాదాయ శాఖకు అందించి, చేనేత కలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నాడు. అలాగే ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నేతన్నలకు పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు హరిప్రసాద్.
గతంలో హరి ప్రసాద్ తనకున్న మేధా శక్తిని కూడగట్టుకొని కార్మిక క్షేత్రంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. మొదట అగ్గిపెట్టలో ఇమిడే చీర సూది రంద్రంలో దురే చీర నేసి అబ్బురపరిచాడు. అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ, విదేశాల ప్రాధానుల నేతల ముఖచిత్రాలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖచిత్రం నేసి ప్రధానికి పంపించాడు.
భారత రత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గం పై నేసి అందించాడు. మొన్న దేశంలో జరిగిన జి20 సదస్సు లోగో నేసి భారత ప్రాధానమంత్రి నరేంద్ర మోడీకి అందించి మన్నలను పొందాడు. 95 ఏపిసోడ్ మన్ కి బాత్ లో హరి ప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎప్పుడు ఎదో ఒక ప్రయోగం చేస్తూ హరిప్రసాద్ అందరి మన్ననలు అందుకుంటున్నాడు.