Chhattisgarh: సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కిష్టారామ్ పీఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మాయిస్టులు ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా ఈ ఆపరేషన్ లోనే ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు.
ఘటనాస్థలి నుంచి ఇప్పటివరకు ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ వెల్లడించారు. అయితే, ఎన్కౌంటర్తో ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 83 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో 67 మంది బస్తర్ డివిజన్లోని సుక్మా సహా ఏడు జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.