మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం

Markapuram: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో ఒక ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు, టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి.
ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, 13 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు.



