Khammam: ఆన్లైన్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని తీసింది..

Khammam: ఆన్లైన్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, భార్యాపిల్లల్ని చూసుకోవాల్సిన ఓ వ్యక్తి బెట్టింగ్ కు బానిసై ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గైగొళ్లపల్లికి చెందిన కోరట్ల ఉపేందర్(38)అనే వ్యక్తి తన సొంత ఆటోలో ఖమ్మం నగర మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చి గ్రామాల్లో విక్రయించుకుంటూ జీవనం గడిపేవాడు. ఇతని తండ్రికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు.
ఉపేందర్ కొద్ది నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. తండ్రి వారించినా తీరు మార్చుకోలేదు. రూ.5-6 లక్షలు అప్పులు చేశాడు. వీటిని తీర్చలేక మానసికంగా ఒత్తిడికి గురై ఇంట్లో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడాడు. ఎస్సై నాగరాజు పంచనామా నిర్వహించి శవపరీక్ష నిమిత్తం శవాన్ని నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించారు. తండ్రి అప్పయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపేందర్ కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.