జాతియం

ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి బీభత్సం.. శిథిలాల కింద కుటుంబాలు!

Uttarakhand: ఉత్తరాఖండ్‌ను కుంభవృష్టి కుదిపేసింది. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా, మరికొందరు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి.

చమోలీ జిల్లా దేవల్ ప్రాంతంలోని మోపటాలో జరిగిన ఘటనలో తారా సింగ్, ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువుల పాక కూలిపోవడంతో దాదాపు 15 నుంచి 20 పశువులు మృత్యువాత పడ్డాయి.

రుద్రప్రయాగ్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అలకనంద, మందాకిని నదులు సంగమ స్థానం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కేదార్‌నాథ్ లోయలోని లవారా గ్రామంలో మోటారు రోడ్డుపై ఉన్న ఒక వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. రుద్రప్రయాగ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా నీట మునిగింది. నదీ జలాలు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో అధికారులు ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా హల్ద్వానీ-భీమ్‌తాల్ రహదారిపై రాణి బాగ్ వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలీ, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో అధికారులు శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button