జమ్మలమడుగు వైసీపీలో జగడం

Jammalamadugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక ఎత్తు అయితే…. ఆ ఒక్క నియోకవర్గ రాజకీయాలు మాత్రం మరో ఎత్తు. గతంలో ఇక్కడ ఏలిన ఫ్యాక్షన్ రాజకీయాలైతే ఇప్పుడు లేవు కానీ… భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఒకే ప్రధాన పార్టీకి ఇద్దరేసి హేమాహేమీలు. ఒక నియోజకవర్గం.. ఇద్దరు ఇంచార్జీలు.. రెండు కార్యాలయాలు.. ఎందుకలా..? ఇది ఆ పార్టీకి బలమా..? లేక గందరగోళమా.? ఇంతకీ ఎవరా నేతలు…? ఎక్కడా నియోజకవర్గం..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్షన్ అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది జమ్మలమడుగు. కడప జిల్లాలో ఉంటున్న ఈ ప్రాంతానిది ఎప్పుడూ ప్రత్యేకతే. ఎవరూ ఊహించని రాజకీయాలు ఇక్కడ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి జమ్మలమడుగు కంచుకోట కానీ మారుతున్న సమీకరణాల్లో పెను సంచాలనాలే ఇక్కడ జరిగిపోయాయి. నాలుగు దశాబ్దాలుగా పైబడి ఒకే పార్టీలో రాజకీయం చేసిన నేతలు సైతం మనసు మార్చుకుంటున్నారు. పార్టీలు మారి పక్కకు వచ్చేస్తున్నారు.
ఫ్యాక్షన్ పాలిటిక్స్కు కేరాఫ్ అయిన జమ్మలమడుగులో మొన్నటివరకు వేర్వేరు పార్టీల్లోని ప్రత్యర్థులు తలపడగా ఇప్పుడు ఒకే పార్టీలోని నాయకులు ఢీ అంటే ఢీ అంటున్నారట. ఇద్దరు నేతల తీరేంటో అర్ధంగాక వైసీపీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు సతమతం అవుతున్నట్టు సమాచారం.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి. అయితే కాస్త అటు ఇటుగా అదే టైంలో నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక అక్కడి నుంచి రగడ మొదలైందట.
మెల్లిగా ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ వైసీపీలో కొనసాగుతున్నా ఆ సోయి లేకుండా ప్రత్యర్థుల్లాగా పోట్లాడుకున్న సందర్భాలున్నాయి. ఒక దశలో రామసుబ్బారెడ్డి వర్గంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయులు నేరుగా దాడులు చేశారు అప్పట్లో. ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా తేడా పడుతుందని గ్రహించిన వైసీపీ పెద్దలు రాజీ ప్రయత్నం చేశారు.
అయితే… వాళ్ళు సర్ది చెప్పిన రోజు సైలెంట్గా ఉంటూ, మరుసటి రోజు నుంచి షరా మామూలే అన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఈ పరిస్థితుల్లోనే 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు వైసిపి అభ్యర్థిగా సుధీర్ రెడ్డి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి చేతిలో వైసీపీకి చెందిన సుధీర్ రెడ్డి ఒడిపోయారు ఇలాంటి కష్టకాలంలో పార్టీకి బలంగా ఉండి కార్యకర్తలకు దగ్గర కావాల్సిన నేతల్లో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయట ఇద్దరి మధ్య సఖ్యత పాము ముంగిస లానే మారిందట కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పి చూసినా ఫలితం కానరాలేదట అందుకే పంచాయితీ నేరుగా పార్టీ పెద్ద మాజీ సీఎం జగన్ దగ్గరకు వెళ్లిందట.
ఇక ఆ తర్వాతి నుంచి రామసుబ్బారెడ్డి దూకుడు పెంచారట. అప్పుడంటే సుధీర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కామ్గా ఉన్నాను.. ఇక ఇప్పుడు మనకు అడ్డేముందని ఆయన సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గంలో వైసీపీ ఆఫీస్ ఉండగా సొంతగా మరో ఆఫీస్ ప్రారంభించారు ఎమ్మెల్సీ.
వ్యవహారం మరీ ముదిరిపోవడంతో మరోసారి రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు నియోజకవర్గంలోని మొత్తం ఆరు మండలాలను సగం సగం విభజించి చెరో మూడు మండలాలు అప్పగించారట. జమ్మలమడుగు మైలవరం పెద్దముడియం రామసుబ్బారెడ్డికి ఎర్రగుంట్ల ముద్దనూరు కొండాపురం మండలాలు సుధీర్ రెడ్డికి అప్పగించారట మీ ప్రాంతాల్లో మీరుండి పార్టీని బలోపేతం చేయాలని సూచించారట ఇలా నేతలిద్దయికీ హితబోధ చేసి పంపారట వైఎస్ జగన్.
అయినా నో యూజ్. ఎవరి పని వాళ్ళు చేసుకునే సంగతి పక్కనపెడితే వివాదం ఇంకా ముదిరిందన్నది లోకల్ టాక్. ఏడాది క్రితం వరకు తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని విభజించి సగం మరో నేతకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి. అందుకే రామసుబ్బారెడ్డికి అప్పచెప్పిన జమ్మలమడుగు పట్టణానికి ఈ మధ్య తరచూ వస్తూ తన కార్యాలయంలో కూర్చుని స్థానిక నేతలతో మీటింగ్స్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
అంతేకాకుండా రామసుబ్బారెడ్డికి అప్పగించిన మూడు మండలాలను తిరిగి తన పరిధిలోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే. అందుకే తన పరిధిలోని వాటిని వదిలేసి మిగతా మూడు మండలాల్లో తరచూ తిరుగుతూ స్థానిక నేతల్ని కలుస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే ఇప్పుడు జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తల్ని ఇరకాటంలో పడేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి వెనక నడవాలో అర్ధంకాక తలలు బాదుకుంటోందట కేడర్. వాళ్ళంతా సుధీర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు రామసుబ్బారెడ్డిని విమర్శించడం, అలాగే రామసుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు సుధీర్ రెడ్డిని విమర్శించడం అలవాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని కొందరు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తుంటే…. ఎక్కువ మంది మాత్రం ఇబ్బందిగా ఫీలవుతున్నారట.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పుకుంటున్న క్రమంలో ఇదెక్కడి పరిస్థితిరా దేవుడా, వీళ్ళిద్దరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని మొత్తానికే ముంచేస్తారా అని కార్యకర్తలు కంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డికి చెక్ పెట్టడానికే మాజీ ఎమ్మెల్యే రూట్ మార్చారన్నది ఇంకో టాక్.
ఎవరు ఎవరికి చెక్ పెట్టుకున్నా అంతిమంగా అది పార్టీ మీద వ్యతిరేక ప్రభావం చూపుతోందన్నది జమ్మలమడుగు వైసీపీ కేడర్ బాధ. చివరగా ఇక్కడ కొసమెరుపు ఏంటంటే మరో ముఖ్యనేత ఒకరు నేనూ ఆఫీసును త్వరలో ఓపెన్ చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారట ఆనేత ఎవరు ఆయన తెరిచే మరో కార్యాలయమెక్కడ అనేది తెలుసుకోడానికి. కొద్దిగా వేయిట్ చేయాల్సిందే.