Revanth Reddy: గురుకులాల్లో డే స్కాలర్ విద్య

Revanth Reddy: గురుకులాల్లో డే స్కాలర్ విద్య అందించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలన్న సీఎం, అందుకు స్థలాలు గుర్తించాలని విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు.
అద్దె చెల్లించలేదంటూ గురుకులాల భవనాలకు యజమానులు తాళాలు వేస్తున్న విషయం తనకెందుకు చెప్పలేదని అధికారులను రేవంత్ ప్రశ్నించినట్లు సమాచారం. సమీక్షకు కొందరు సరిగా సన్నద్ధమై రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అలాంటిచోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చుట్టుపక్కల నుంచి వచ్చి చదువుకొని ఇళ్లకి వెళ్లేలా డే స్కాలర్లకు అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన ఆయన, కోరుకున్న విద్యార్థులందరికీ గురుకులాల్లో సీట్లు ఇవ్వలేమని, అయితే డే స్కాలర్లకు సైతం గురుకులాల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించవచ్చని తెలిపారు. ఆ తర్వాత వారు ఇళ్లకు వెళ్లి కుటుంబంతో గడపవచ్చన్న సీఎం ఆ విషయాన్ని పరిశీలించాలని సూచించారు.