103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ.. నగరం మొత్తం కనిపించేలా అసెంబ్లీ టవర్.. ఎన్ని కోట్లు ఖర్చంటే?

CRDA Gives Nod for works worth 24,276 crore in Amaravati: రాజధాని అమరావతి పనులను ఏపీ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నగరం ఉండేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమరావతిలో రూ.24,276 కోట్లతో పనులు చేపట్టేందుకు ఆమోదం లభించింది. హైకోర్టు, అసెంబ్లీ, ఐకానిక్ టవర్లు వంటి నిర్మాణాల కోసం ఈ మొత్తం ఖర్చు చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు.
CRDA Gives Nod for works worth 24,276 crore in Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలకు టీడీపీ కూటమి సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని అమరావతికి ఓ రూపు తీసుకువచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అమరావతిలో చేపట్టాల్సిన అనేక పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా సీఆర్డీఏ మరోసారి సమావేశమైంది. తాజా సమావేశంలో కొత్తగా రూ.24,276 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకూ అమరావతిలో రూ.45,249 కోట్లకు సీఆర్డీఏ ఆమోదం లభించిందని మంత్రి చెప్పారు.
మరోవైపు రాజధాని అమరావతిలో రెండు సంవత్సరాల్లోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. నిర్మాణ సముదాయాలను 9 నెలల్లోగా పూర్తి చేస్తామని చెప్పారు. సోమవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్ పనులకు ఆమోదం లభించిందని నారాయణ చెప్పారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్లు నిర్మించనున్నామన్న మంత్రి పొంగూరు నారాయణ.. ఐదు ఐకానిక్ టవర్ల కోసం రూ.4,665 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ హైకోర్టు నిర్మాణానికి రూ.1,048 కోట్లు, అసెంబ్లీ భవనానికి రూ.768 కోట్లు ఖర్చు చేసేందుకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని వివరించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రూ.768 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే నగరం మొత్తం కనిపించేలా అసెంబ్లీపై టవర్ ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల రోజుల్లో మినహా మిగతా రోజుల్లో అసెంబ్లీ టవర్ చూడ్డానికి సందర్శకులను అనుమతించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే నాలుగు జోన్లలో రోడ్ల టెండర్లకు రూ.9,699 కోట్లు , ట్రంక్ రోడ్లకు రూ.7,794 కోట్లు ఖర్చు చేసేందుకు సీఆర్డీఏ ఆమోదం లభించిందని మంత్రి నారాయణ వివరించారు. కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.