Raghunadha Swamy Temple: గొల్లపల్లి శ్రీ రఘునాథ స్వామి దేవాలయ చరిత్ర

Raghunadha Swamy Temple: అది సీతారాముల వారు అరణ్య వాస ప్రయాణంలో సేద తీరిన ప్రాంతం. నాటి చెరగని గుర్తులతో దర్శనమిస్తున్న పుణ్యక్షేత్రం. రఘునాథస్వామికి కుడి పక్క నిలిచిన సీతమ్మ వారి యుద్దుపురి క్షేత్రం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది..? ఆ ఆలయ ప్రతిష్టలేంటి..?
భారతదేశ చరిత్రలో నూజివీడు సంస్థానానికి ఎంతో ఘన చరిత్ర, ప్రాముఖ్యత ఉంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నూజివీడు ప్రాంతంలో అత్యంత మహిమ కలిగిన, ప్రాచీన రఘునాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగిన అనంతరం మూడవరోజున ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరుగుతోంది. ఈ ప్రాంతంలో సీతా, రామ, లక్ష్మణులు సంచరించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
దీనికి సంబందించిన ఆనవాళ్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. రామాయణం కాలంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడు, సీతా, లక్ష్మణ సమేతంగా గొల్లపల్లి ప్రాంతంలో సంచరించినట్లు ఇక్కడ చరిత్ర చెబుతోంది. సీతమ్మ వారు స్నానం చేసిన కొలను, చీరను ఆరవేసుకున్నట్లు గుర్తులు ఉన్న రాతి బండ ఇక్కడ కనిపిస్తుంది.
అంతే కాదు రఘునాథ స్వామి వారి ఆలయం పక్కన ఉన్న బావిలో రాములవారు ఆనాడు వేసిన బాణం ఉండటమే దానికి నిదర్శనం వారు వనవాసం చేస్తున్న సమయంలో సీతమ్మవారికి దాహం వేయాగా, రాములవారు ఒక బాణాన్ని భూమిలోకి వేశారు. బాణం తగలగానే భూమి నుండి జలం ఊరడంతో సీతమ్మవారు దాహం తీర్చుకున్నారు. ప్రస్తుతం ఆ జల ధార ప్రవహించిన ఏరుకు రామిలేరు అని పేరు వచ్చింది. అందుకే ఈ ప్రాంతం మహిమ కలిగిన ప్రాంతంగా పేరు గడించింది.
హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర మూర్తికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. కానీ ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లిలో ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి దేవాలయం ఎంతో విశిష్టమైనది. యధుపురి క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన, ఆధ్యాత్మికమైన, విశిష్టమైన శక్తిని కలిగి ఉన్న ఈ ఆలయం చరిత్ర గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే రాముడు అంతటి గొప్పవాడు రాముడే కదా అలాంటి రఘునాథుడు వేసిన బాణం ఇప్పటికీ ఉన్న ఆలయం ఇదే.
త్రిలోక సంచారి అయిన నారద మహర్షి స్వయంగా ఈ ఆలయ మహత్యాన్ని తెలుసుకుని, హరిత మహర్షికి అత్యంత మనోహరంగా వివరించారు. యధుపురిని పోలిన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే మరొకటి లేదు రఘురామునితో పోల్చదగిన దేవుడు మరొకరు లేరు అంటూ అత్యంత శక్తివంతమైన ఈ ఆలయ మహిమలను నారద మహర్షి స్వయంగా వివరించినట్లు పురాణాల్లో ఉంది.
ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి కృష్ణా జిల్లా, నూజివీడు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి రాష్ట్రంలోని నలు మూలాల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. హనుమంతుడు ఈ ఆలయానికి పాలకుడు. ఈ ఆలయం చుట్టుపక్కల హనుమంతునికి సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి.
రాములవారిని సీతా, లక్ష్మణ సమేతంగా గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సమయంలో ఇద్దరూ గొల్లలు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించే వారిని ఈ ప్రాంతవాసులు చెబుతుంటారు. ఆ తర్వాత మలవల్లి గ్రామానికి చెందిన జంపన్న వెంకన్న బట్టు, పల్లెర్లమూడి గ్రామ నివాసి అయిన ఒక సాధారణ వైశ్యులకు స్వామివారి కలలో కనిపించే గుడి కట్టవలసినదిగా వారికి ఆదేశించడం వారి శక్తి మేరకు ఒక చిన్న గుడిని నిర్మించినట్లు తెలుస్తోంది.
అప్పటినుండి నండూరి వారు స్వామివారి అర్చనాది కార్యక్రమాలకు, దేవాలయ నిర్వహణకు వేంపాడు భూముల్లో 1100 ఎకరాలను ఆలయానికి దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గొల్లపల్లి జమీందారులైన మేకా వంశీయులు తమ గురువులు శ్రీ వానమామలై జియ్యం గారిచే ప్రత్యేక హోమములు నిర్వహించి దేవాలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారము ఆలయాన్ని దివ్య స్థలముగా చేసినట్లు చరిత్రలో తెలుస్తోంది.
ఈ దేవాలయంలో చైత్ర శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి కల్యాణం జరుగుతుంది. దానికి కారణం రవాణా సౌకర్యం లేని ఆ సమయంలో భద్రాచలంలో శ్రీరామ నవమికి జరిగే స్వామివారి కల్యాణంలో పాల్గొని, తిలకించిన అనంతరం కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను, ముత్యాలను ఇక్కడకు తీసుకువచ్చి స్వామివారి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాల్లో కలపడం నేటికి ఆనవాయితీగా వస్తోంది.
స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి విశేషంగా భక్తులు తరలివస్తారు. 600 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగి ఉన్న ఈ ప్రాచీన గొల్లపల్లి రఘునాథ స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలూ వైదొలగుతాయని, స్వర్గానికి వెళ్తామని భక్తుల విశ్వాసం.