ఆంధ్ర ప్రదేశ్

ఏపీ ప్రభుత్వంలో పవన్ ప్రకంపనలు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తాను వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఈ వీరమల్లు కేబినేట్ సమావేశాలలో వీర ముళ్ళుగా గుచ్చుకుంటుందని టాక్ ఆఫ్ ది కేబినేట్. కేబినేట్ సమావేశాలలో జరుగుతున్న పరిణామాలపై, కీలక నిర్ణయాలపై గబ్బర్ సింగ్ శైలిలో ఉపముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంట.ఎన్నికల ముందు వైసీపీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించిన పవన్ ఇప్పుడు అధికార పక్షంలో రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకు ప్రశ్నిస్తున్నారని చర్చ మొదలైందట.

మంత్రివర్గంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే అంశాలపై ప్రతిసారీ ఆయన ఒక ప్రశ్నించే సేనాని అవుతున్నాడట. ప్రభుత్వంలోని లోపాలను, అన్యాయాలను ముక్కుసూటిగా కేబినెట్ దృష్టికి తీసుకెళ్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర మంత్రులను పునరాలోచించేలా చేస్తున్నారని సమాచారం.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా లూలూ సంస్థలకి భూ కేటాయింపులపై కేబినెట్ లో ప్రస్తావించారు. పవన్ తో పాటు ఆ పార్టీకి చెందిన మంత్రులు సైతం ఏదో ఒక అంశంపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకరు సంస్థల భూ కేటాయింపులపై ప్రశ్నిస్తే, మరొకరు అధికారుల పెత్తనంపై ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు నేరుగా పలు అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా తొలుత మంత్రి నాదెండ్ల మనోహర్ ని అస్త్రంగా ప్రయోగిస్తున్నారట.

పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న సందర్భంలో ఆయా శాఖలకి చెందిన మంత్రులు సమాధానం చెప్తున్నారట. పవన్ కళ్యాణ్ ప్రతి శాఖ పనితీరు అలాగే లోటుపాట్ల గురించి గుర్తుచేస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి ఏఖీభవిస్తూ మరొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేస్తున్నారట.రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతోపాటు కేబినేట్ తీసుకుంటున్న నిర్ణయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారట.

పవన్ కళ్యాణ్ గత కేబినేట్ సమావేశాలలో శాంతిభద్రతల అంశంపైన కూడా ఘాటుగా స్పందించారు. ఆ మధ్య వరుసగా జరిగిన కొన్ని అత్యాచార ఘటనలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరాల విషయంలో పోలీసులు, అధికారులు కులం, మతం, రాజకీయాల అండ చూసుకుని చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతే కాకుండా నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని పవన్ సీరియస్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి.

క్రిమినల్స్‌కు యూపీలో యోగి ఆదిత్యనాథ్ చుక్కలు చూపించినట్లు …తానూ చేస్తాను అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, హోంమంత్రి వంగలపూడి అనిత ఈ విషయంలో బాధ్యత వహించాలని సూటిగా చెప్పారు.దీంతో హోంమంత్రి వంగలపూడి అనిత రియాక్ట్ కావాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్‌ను స్వయంగా కలిసి, శాంతిభద్రతల అంశాలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా అదనంగా భూములు సేకరించాలన్న ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ గతంలో జరిగిన కేబినేట్ సమావేశంలో అభ్యంతరం తెలిపారని సమాచారం. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ముందుకు వెళ్లవద్దని ఆయన స్పష్టం చేయడంతో, ఆ ప్రతిపాదనపై ప్రభుత్వం బ్రేక్ వేసిందంట. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చడానికి సంబంధించిన నాలా చట్ట సవరణ ప్రతిపాదనపైనా పవన్ కల్యాణ్ అభ్యంతరం తెలిపారట.

వ్యవసాయ భూమి దుర్వినియోగం అవుతుందని రైతులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆయన ఈ ప్రతిపాదనను అడ్డుకున్నట్లు సమాచారం. ఇలా ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలపై అసహనం వ్యక్తం చేశారట.పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కొన్ని సందర్భాలలో కేబినేట్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలని వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందట.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button