తెలంగాణ

Patnam Narender reddy: లగచర్ల నిందితులకు భారీ ఊరట.. పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్

Patnam Narender reddy: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు.. నిందితులకు భారీ ఊరటనిచ్చింది. ఈకేసులో నిందితులుగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డితోపాటు మరో 23 మందికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేయగా.. ఇవాళ నిందితులకు బెయిల్ ఇచ్చింది. పట్నం నరేందర్ రెడ్డితోపాటు కీలక నిందితులుగా ఉన్న సురేష్ సహా ఇతర నిందితులకు బెయిల్ మంజూరు కావడంతో వారు జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయి.. నిందితులు గత నెలరోజులుగా జైలులో ఉన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి చ‌ర్లప‌ల్లి జైలు నుంచి బయటికి రానున్నారు.

బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు కొన్ని ష‌ర‌తులు విధించింది. ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి రూ. 50 వేల పూచీక‌త్తుపై, మిగ‌తా వారికి రూ. 20 వేల పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి రెండు షూరిటీలు, మిగితా వారికి ఒక షూరిటీ ఉండాలని తెలిపింది. అంతేకాకుండా 3 నెలల పాటు ప్రతీ బుధవారం పట్నం నరేందర్ రెడ్డితోపాటు ఇతర నిందితులు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.


నవంబర్‌ 11వ తేదీన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై స్థానికులు దాడి చేశారు. ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ సహా ఇతర అధికారులు.. లగచర్లకు చేరుకున్న సమయంలో కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు గ్రామస్తులను అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయన హైదరాబాద్‌లో మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.


ఇక లగచర్ల ఘటనకు సంబంధించి నాంపల్లి స్పెషల్ కోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. రైతుల తరఫున సోమవారం లాయర్లు సురేందర్‌రావు, జక్కుల లక్ష్మణ్, జి.కిరణ్‌లు వాదనలు వినిపించగా.. మంగళవారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కౌంటర్‌ దాఖలు చేసి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి అఫ్రోజ్‌ అక్తర్‌.. తీర్పును రిజర్వ్‌ చేస్తూ బుధవారానికి వాయిదా వేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదన­లు వినిపిస్తూ ఎలక్ట్రానిక్‌ సమాచారంతోపాటు లగచర్ల ఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు కోర్టుకు అందించారు. వెంటనే జోక్యం చేసుకున్న రైతుల తరఫు లాయర్లు.. ఆ ఫోటోల్లో ఉన్న ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేయలేదని.. ఈ ఘటనకు సంబంధం లేని రైతులు, మాజీ ఎమ్మె­ల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారని ఆరోపించారు.

ఇక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఒక్కరు కూడా అరెస్ట్ అయి రిమాండ్‌లో లేరని వాదించారు. అయితే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడటం, వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌లు ఉన్నాయని.. అవన్నీ కోర్టుకు సమర్పించామని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డితోపాటు మిగిలిన రైతుల అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి బెయిల్ మంజూరు చేయాలని రైతుల తరఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేయగా.. అందుకు అంగీకరించిన నాంపల్లి కోర్టు.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button