Harish Rao: కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు అసహనం

Harish Rao: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై గులాబీ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులను సర్కార్ పెద్దలు మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డీఏలను తక్షణం చెల్లిస్తాం అని అభయహస్తం మేనిఫెస్టోలో నమ్మబలికి 5 డీఏలు పెండింగ్లో పెట్టారని విమర్శలు చేశారు. ఇప్పుడు ఉసూరుమంటూ ఒక్క డీఏ రిలీజ్ చేశారని ఆగ్రహించారు.
ఇదేనా డీఏలు సకాలంలో ప్రకటించడం, బకాయిలను నేరుగా చెల్లించడం అంటే రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పీఆర్సీ ఏర్పాటు అని మభ్యపెట్టి, 18 నెలలు గడుస్తున్నా పీఆర్సీ ఊసే లేదన్నారు. ఆరు నెలల తరువాత ఇంకో డీఏ అని చెప్పడం విడ్డూరమన్నారు. జనవరి, జూలై నెలలో సంవత్సరానికి రెండు డీఏలు ఉద్యోగస్తులకు ఇస్తారని వెల్లడించారు. 2025 జనవరి డీఏను కేంద్రం మార్చిలో ప్రకటించింది. జూలై నెల డీఏను సెప్టెంబర్లో కేంద్రం ప్రకటించే అవకాశం ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
అటువంటప్పుడు 6 నెలల తర్వాత డీఏ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ స్కీమ్ జీవోను ఇప్పుడు అమలు చేస్తామని చెప్పడం విడ్డూరం అని మండిపడ్డారు. పీఆర్సీ ప్రస్తావన లేదు, పెండింగ్ బకాయిలు ప్రస్తావన లేదని ఫైర్ అయ్యారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ప్రస్తావన లేదని చురకలు అంటించారు మాజీ మంత్రి హరీష్ రావు.