Mark Carney: ట్రంప్ వద్దు.. మోదీయే ముద్దు అంటున్న కొత్త ప్రధాని కార్నీ

Mark Carney: కెనడా ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదంతా ఒక్కెత్తు అయితే ఇప్పుడు మార్క్ కార్నీ గెలవడం భారత్కు కలిసి వచ్చిన అంశం. అవును చెప్పేది నిజమే. కెనడా ఇండియాకు జై కొట్టబోతోంది. మొన్నటి వరకు ఇండియాతో అమీతుమీ అన్న ట్రూడో పాలన ముగిశాక ఇప్పుడు కొత్త ప్రధాని ట్రంప్ వద్దు మోదీ ముద్దు అంటున్నారు. అంతేకాదు కార్నీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ప్రస్తావించారు. ఇప్పుడాయనే కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కెనడియన్ ఎన్నికల్లో మార్క్ కార్నీ ఇప్పుడు విజయం సాధించడం ఇండియాకు అడ్వాంటేజ్ కాబోతోంది. చెప్పాలంటే కెనడాతో దెబ్బతిన్న అంతర్జాతీయ సంబంధాలలో బలోపేతానికి ఇండియాకు మంచి అవకాశం లభించింది. అటు రాజకీయంగాను ఇప్పుడు కెనడా ఇండియాతో సయోధ్యకు సిద్ధమవుతోంది. అంతేకాదు కొత్తగా అధికారంలోకి రానున్న కార్నీ తాను ఇండియాతో కలిసి పనిచేస్తానని గతంలో క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి గతంలో కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఎన్నికల ప్రచారంలో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేస్తానని కార్నీ ప్రకటించారు. కెనడా ఏం చేయాలని చూస్తుందో అదే ఆలోచనా సరళి ఉన్న దేశాలతో తమ సఖ్యత కొనసాగుతుందని కార్నీ ప్రకటించారు. ఇండియాతో సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ వాణిజ్య సంబంధం చుట్టూ విలువల ఉమ్మడి భావన ఉండాలన్నారు.
2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్లు ఉన్నారని ట్రూడో ఆరోపణలతో ఇరుదేశాల మధ్య అగ్గిరాజుకుంది. 2023లో భారతదేశం-కెనడా సంబంధాలు అధోగతి పాలయ్యాయి. 2024 అక్టోబర్లో, కెనడా ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడంతో ఉద్రిక్తతలు ముదిరికాపాకాన పడ్డాయి. నిజ్జర్ హత్యలో ప్రమేయాన్ని ఇండియా నిర్ద్వంద్వంగా తిరిస్కరించింది. ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. దీంతో రెండు దేశాలు రాయబారులను బహిష్కరించడానికి, వాణిజ్య చర్చలను స్తంభింపజేయడానికి కారణమైంది.
ఇక కెనడా సిక్కు డయాస్పోరాలో ఒట్టావా తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తోందని న్యూఢిల్లీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ట్రూడో ప్రభుత్వం వేర్పాటువాదానికి మద్దతిస్తోందని ఇండియా ఆరోపిస్తూ వచ్చింది. ఐతే తాజాగా కార్నీ విజయం ఇండియాకు ప్లస్గా చెప్పాలి. ఇది రెండు దేశాలకు కీలకంగా మారనుంది. 60ఏళ్ల మార్క్ కార్నీ బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండింటికీ నేతృత్వం వహించడం ద్వారా బిజినెస్ యాంగిల్ బాగా తెలుసు. ఎన్నికల్లో కెనడా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేవారిని ఉపేక్షించమంటూ ఆయన ప్రచారం చేశారు.
కెనడా కోసం ఎవరితోనైనా యుద్ధం చేస్తామని అది వాణిజ్యమైనా, మరోటైనా అంటూ ఆయన కుండబద్ధలుకొట్టారు. అమెరికా సుంకాల బెదిరింపులతో కెనడా తలొగ్గదన్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కెనడా స్వయంప్రతిపత్తికి ముప్పుగా కార్నీ అభివర్ణించాడు. కెనడాను సొంతం చేసుకునేలా డోనాల్డ్ ట్రంప్ కుట్ర చేస్తున్నారని కార్నీ ఆరోపించాడు. అమెరికాకు వ్యతిరేకంగా, కెనడా వాణిజ్య సంబంధాలను వైవిధ్యపరచడానికి ప్రతిజ్ఞ చేశారు, అలాంటి సమయంలో ఇండియా తమకు కీలక భాగస్వామిగా పేర్కొన్నాడు.