Khammam: భార్యకు ప్రేమ పెళ్లి చేసి.. భర్త ఆత్మహత్య

Khammam: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణానికి చెందిన షేక్ గౌస్ అనే వ్యక్తికి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా, ముగ్గురు సంతానం ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం సత్తుపల్లి పట్టణం దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్లి ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే తన స్నేహితుడితో తన భార్య ప్రేమలో పడిన విషయం తెలుసుకున్న భర్త ఆమె ప్రియుడికి ఇచ్చి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశాడు.
అనంతరం ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొప్ప మనసుతో భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన గౌస్ తన బిడ్డల గురించి మాత్రం ఆలోచించలేకపోయాడు. గౌస్ ఆత్మహత్యతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గౌస్ మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.



