అంతర్జాతీయం

గాజా శాంతి సదస్సుకు ప్రధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం..

గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా ఈజిప్టులో నేడు జరగనున్న ఉన్నతస్థాయి సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి సంయుక్తంగా ఈ ఆహ్వానం పంపారు. అయితే, చివరి నిమిషంలో ఈ పిలుపు అందినందున, ప్రధాని మోడీ ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో భారత ప్రతినిధిగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాల్గొననున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో ఈ శాంతి ఒప్పంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్‌లో అమెరికా, ఈజిప్టు అధ్యక్షుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ భేటీలో 20కి పైగా దేశాల నాయకులు పాల్గొంటారని ఈజిప్టు అధ్యక్షుడి ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోడీకి శనివారమే ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానం అందినట్లు సమాచారం.

ఈ కీలక సమావేశానికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌తో పాటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ వంటి పలువురు ప్రపంచ నేతలు హాజరుకానున్నారు. గాజాలో శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా జరగనున్న ఈ సదస్సుపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button