ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం..

Andhra Pradesh: గంగపుత్రులకు తీరని అన్యాయం జరుగుతుంది. మత్స్య సంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తోంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం పరిహారం ఇవ్వడం పరిపాటి. అయితే కొత్తపల్లి మండలంలో ఉప్పాడ, సుబ్బంపేట, కొత్తపట్నం, మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనబాద్, మూలపేట, పల్లిపేట, కోనపాపపేట తదితర మత్స్యకార గ్రామాలున్నాయి.
వీరిలో అధికశాతం మత్స్యకారులకు వేటపరిహారం నేటికీ మంజూరు కాలేదు. 61రోజుల వేట నిషేధంలో ఇప్పటికే 45రోజులు పూర్తి కావస్తోంది. ఇప్పటికీ తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులకు వేట పరిహారం మంజూరు కాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మత్స్యకారులందరికీ వేట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మత్స్యకారులు కోరుతున్నారు.