Grama Sabalu: నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు

Grama Sabalu: తెలంగాణలో గ్రామసభల నిర్వహణకు వేళైంది. నాలుగు ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం.. లబ్ధిదారులను గుర్తించేందుకు.. నేటి నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. అనంతరం.. ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.
తాత్కాలిక జాబితాను సిద్దం చేశారు అధికారులు. దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల సమక్షంలో.. వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోల సహకారంతో సర్వే నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ప్రజల ముందు వెల్లడిస్తారు. అక్కడ వచ్చే అభ్యంతరాలు, అభ్యర్థనలను ఆధారంగా చేసుకొని తుది అర్హుల జాబితాను సిద్ధంచేయనున్నారు.
సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి రైతుభరోసా కింద 12వేలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద.. భూమిలేని ఉపాధి కూలీలకు ఏటా 12వేలు రెండు విడతల్లో అందించనుంది. నిరుడు కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన వారికే.. ఇందిరమ్మ భరోసా పథకం వర్తించనుంది. ఇక.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందనున్నాయి.
ప్రజాపాలన, కులగణన సర్వేతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం.. మీసేవ ద్వారా సమర్పించిన సమాచారం ద్వారా రేషన్ అర్హులను గుర్తించారు. వాటి ఆధారంగా ఆ కుటుంబాల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం తర్వాత కొత్తకార్డుల జారీకి చర్యలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. సర్వేలో పేర్లు రానివారు తిరిగి గ్రామసభల్లో దరఖాస్తులు సమర్పించొచ్చునని అధికారులు చెబుతున్నారు.