నేడు జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈనెల 18న గవర్నర్కి అందజేస్తారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కోరనున్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాలను సేకరించిన విషయం విదితమే.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం)లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ చర్య పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయడమే అని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 10న ప్రారంభమైన ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
మెడికల్ విద్య సామాన్యులకు దూరమవుతుందనే ఆందోళనతోనే ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు వైసీపీ స్పష్టం చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం మరింత ఉధృతం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.



