జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు

జూబ్లీహిల్స్ బైపోల్ వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు తీవ్ర కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. మోతీ నగర్లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు.
ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్థన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులే తన ఇంట్లో డబ్బులు పెట్టించారని ఆరోపించారు. పోలీసులే బ్యాగులను తన ఇంట్లోకి తీసుకెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు. డైవర్షన్ కోసమే తమ ఇళ్లలో సోదాలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ రౌడీయిజం చేస్తోందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు నివాసంలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అయితే, ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు.
ఇక పోలీసుల సోదాల నేపథ్యంలో వారి ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ మమ్మల్ని పోలీసులు బెదిరిస్తున్నారు.
సోదాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారు. బహిరంగంగా రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



