Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మలయప్పస్వామికి హంసవాహన సేవ

Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజు రాత్రి మలయప్పస్వామి వీణాపానిదారుడై హంస వాహనంపై భక్తులను అనుగ్రహించారు. అంతకముందు ఆలయ వెలుపల సహస్రదీపాలంకరణ మండపంలో శ్రీవారి ఊంజలసేవ నయనందకరంగా జరిగింది. అనంతరం వాహనం మండపం చేరుకున్న మలయ్యప్పస్వామి బంగారు హంసవాహనాన్ని అధిరోహించి తిరువీధులలో విహరించారు.
ఉత్సవరాయుడైన తిరుమలేశుడికి యేడాది పొడవునా జరిగే అనేకనేక ఉత్సవాలు, ఊరేగింపుల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత విశేషమైనవి ఈ క్రమంలో ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న వెంకన్న బ్రహ్మోత్సవాల్లో మూడొవ వాహనంగా హంస వాహనంపై మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశించాడు. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలలోపాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ హంస యొక్క స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం.
అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి కలిగించేందుకే స్వామివారి హంస వాహనాన్ని అధిరోహించి ఊరేగుతాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. విద్యూత్ దీపాల కాంతులు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా సాగిన స్వామివారి వాహనసేవకు అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనలు పలికి స్వామివారి ఆశీస్సులు పొందారు. వాహనానికి ముందు వివిధ కళాబృందాల కోలాటాలు, నృత్యాలు, సాంస్కృతిక నడుమ శ్రీహరి హంస వాహన సేవ వీనుల విందుగా సాగింది.



