ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రాకు లారీల కొద్ది తెలంగాణ రేషన్ బియ్యం సరఫరా..

ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వ పెద్దలు బియ్యం బొక్కేశారు.. రేషన్ బియ్యాన్ని అమాంతం మింగేశారని కూటమి ప్రభుత్వం వచ్చాక తేలింది. దీంతో రేషన్ బియ్యం స్కామ్‌ను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ స్కామ్‌లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది.

పేదల బియ్యం దళారుల పాలవుతున్నాయి. దాడులు చేసి అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే.. రేషన్ బియ్యం మాఫియాతో చేతులు కలుపుతున్నారు. దీంతో.. పట్టపగలే దర్జాగా CMR మాటున మిల్లర్లు బియ్యం సంచులు మార్చి.. తిరిగి ప్రభుత్వానికే సరఫరా చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సివిల్ సప్లయ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. అయితే.. ఇందులో చిన్న ట్విస్ట్ కూడా ఉందండోయ్. తెలంగాణ రేషన్ బియ్యాన్ని ఆంధ్రా స్మగ్లర్లు కొనుగోలు చేసి… మళ్లీ తెలంగాణ రైస్ మిల్లర్లకు విక్రయాలు చేస్తున్నాయన్న వార్తలు కూడా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం దందా.. కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతుందంటే.. ఆ స్మగ్లర్లకు సంబంధిత అధికారులు ఏ స్థాయిలో సహకారం అందిస్తున్నారో తెలుస్తుంది. ఓ జిల్లా అధికారి అండదండలతో.. రేషన్ బియ్యం దందా భారీ ఎత్తున సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదో మొక్కుబడిగా మోపెడ్ బండ్లపై బస్తాల్లో తరలించే వారిపై కేసులు పెట్టి.. సివిల్ సప్లయ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాదండోయ్.. బియ్యం మాఫియా డాన్లతో కూడా చేతులు కలిపి.. ముడుపులు తీసుకుంటూ.. స్వయంగా జిల్లా స్థాయి అధికారులే మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి.. కమిషన్ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

రేషన్ బియ్యం దందా పై అధికారులకు సమాచారం ఇస్తే.. ముందే ఆ మిల్లర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి జాగ్రత్త పడాలని కూడా చెప్తున్నారంట ఆ అధికారులు. దీంతో.. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ సాంబారు బుడ్డి… అన్నట్లుగా సత్తుపల్లి ప్రాంతంలో దర్జాగానే రేషన్ బియ్యం వ్యాపారం CMR రైస్ పేరుతో తిరిగి ప్రభుత్వం చెంతకు చేరుతుంది.

ప్రభుత్వం సబ్సిడీపై పేదల కోసం రేషన్ బియ్యం ఉచితంగా సరఫరా చేస్తుంది. అయితే.. అలాంటి బియ్యాన్ని కొందరు స్మగ్లర్లు.. డీలర్ల నుంచి TVS మోపెడ్ బండ్లపై కొనుగోలు చేసే వారి నుంచి.. బియ్యం మాఫీయా ముఠా భారీగా కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని స్మగ్లర్లు దర్జాగా కోళ్ల ఫారాలను డంపింగ్ యార్డుగా ఎంచుకొని.. వేల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేస్తారు. ఇక్కడ నుంచి రేషన్ బియ్యం సంచులను మార్చి మిల్లర్లకు విక్రయం చేస్తారు. మిల్లర్లు పట్టపగలే దర్జాగా ప్రభుత్వ గన్ని సంచుల్లోకి రేషన్ బియ్యం నింపి.. CMR రైస్ పేరుతో తిరిగి ప్రభుత్వానికే అమ్ముతారు. ఇలా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మిల్లర్లు కూడా రేషన్ బియ్యం దందా చేస్తూ… దర్జాగానే ప్రభుత్వం నుంచి కీలోకి 34 రూపాయలు పొందుతున్నారు. అయితే.. ఈ తతంగం అంతా సజావుగా సాగాలంటే సంబంధిత డివిజన్ అధికారితో పాటు.. జిల్లా అధికారి సైతం రేషన్ బియ్యం స్మగ్లర్లతో, మిల్లర్లతో ముడుపులు తీసుకొని.. వారి వ్యాపారానికి అండదండలు అందిస్తున్నారని ఆ శాఖలోని సిబ్బందే చెవులు కొరక్కుంటున్నారు.

ఆంధ్రాకు సత్తుపల్లి నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం కావడంతో.. ఆంధ్రా నుంచి బియ్యం దందా చేసే స్మగ్లర్లు రామచంద్రరావు, సాయి దత్తు, జయంతి, శ్రీను, కిరణ్ అనే వ్యక్తులు నెలకు లారీలు కొద్ది బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు సంపాదించేవాళ్ళు. అయితే.. కొద్ది నెలల నుంచి ఆంధ్రా, కాకినాడ పోర్టు ప్రాంతంలో భారీగా దాడులు చేసి అక్రమ రేషన్ బియ్యం మాఫియా పై అక్కడి ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. దీంతో.. ఊసరవెల్లి మాదిరి స్మగ్లర్లు రంగు మార్చి.. తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నారు. సహజంగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు CMRపేరుతో ప్రభుత్వానికి 67% RAW రైస్, 68% సన్న బియ్యం ఎగుమతి చెయ్యాల్సి ఉంటుంది. మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి బస్తా ధాన్యం లెక్కలు Aరికార్డు, Bరికార్డు రూపంలో నమోదు చేసి మిల్లర్లు భద్రపరచాలి. ఆ లెక్కల ప్రకారమే 67% RAW రైస్, 68% సన్న బియ్యం ప్రభుత్వానికి ఎగుమతి చెయ్యాలి. లేని యెడల ప్రభుత్వం మిల్లు లైసెన్సు రద్దు చెయ్యడంతో పాటుగా యజమాని పై 6A కేసు నమోదు చేసి PD యాక్టు కు నమోదు చేసే అవకాశం ఉంటుంది.

అయితే… రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన వేల టన్నుల ధాన్యాన్ని అడ్డదారిలో విక్రయాలు చేసి కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి CMR రైస్ పేరుతో ప్రభుత్వానికి ఎగుమతి చెయ్యాల్సి ఉంటుంది కాబట్టి.. కొందరు స్మగ్లర్లు మాఫియాగా ఏర్పడి జిల్లా స్థాయి అధికారులతో చేతులు కలిపి.. ఆంధ్రా నుంచి బియ్యం దందా చేసే స్మగ్లర్లతో కుమ్మక్కై.. తెలంగాణ రాష్ట్ర పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి.. కోళ్ల ఫారంలలో భారీగా డంప్ చేస్తున్నారు. సంచులు మార్చి మిల్లర్లు ద్వారా తిరిగి ప్రభుత్వానికే విక్రయం చేస్తారు. దీని ద్వారా కిలో బియ్యానికి ప్రభుత్వం నుంచి మిల్లర్లకు 34 రూపాయలు వస్తున్నాయి. ఈ విధంగా కిలో బియ్యానికి 18 రూపాయలు నుంచి 20 రూపాయలు లాభం ఉండటంతో వీరి వ్యాపారం దర్జాగా కొనసాగుతుంది. నెలకు ఒకొక్క మిల్లరు 46 లక్షలకు పైగానే వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

ఈ విధంగా సత్తుపల్లి నియోజక వర్గం వ్యాప్తంగా కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో భారీగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ… తిరిగి ప్రభుత్వానికే అమ్ముతున్నప్పటికి.. దృష్టి సారించాల్సిన అధికారులే ముడుపులకు అలవాటు పడటంతో.. కంచె చేను మేసిన చందంగా తయారైందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ మిల్లర్ల అక్రమాలను ఆపాలని కోరుతున్నారు ప్రజలు.

పేదల బియ్యం పక్కదారి పడుతుంది. నిఘా కరువై దందా జోరుగా నడుస్తుంది. పోలీస్‌ యంత్రాంగం తరచూ పట్టుకుంటున్నా.. అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త ముఠా పుట్టుకొస్తూనే ఉంది. కొందరు డీలర్లు అక్రమార్కులతో చేతులు కలుపడం వల్లే రేషన్‌ పక్కదారి పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తేనే దందాకు చెక్‌ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button