కేంద్రం ఆధీనంలోకి ఉపాధిహామీ పథకం

ఉపాధి హామీ పథకం ఇక కేంద్రం ఆధీనంలోకి వెళ్లనుంది. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండకుండా కేంద్రమే అంతా తానై పథకాన్ని నడపనుంది. ఉపాధి హామీ పథకానికి ఏటా కేంద్రం బడ్జెట్లో నిధులను కేటాయిస్తోంది. నిధుల ఖర్చు, పనుల గుర్తింపు వంటి వాటిని అమలు చేసే బాధ్యతను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది.
అయితే ఉపాధి హామీలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే అక్రమాలు అరికట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా యుక్తధార్ పేరుతో యాప్ తీసుకొచ్చింది.
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 చోట్ల యుక్తధార్ పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు. యాప్పై అవగాహన కల్పించేందుకు ఉపాధి హామీ సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనుల గుర్తింపు దగ్గర నుంచి.. పనులకు వచ్చే కూలీల వివరాలు, బిల్లుల చెల్లింపులు తదితరాలన్నీయుక్తధార్ యాప్ ఆధారంగానే జరగనున్నాయి. జియోస్పేషియల్ ప్లానింగ్ పోర్టల్కు అనుగుణంగా యుక్తధార్ పనిచేస్తుంది.
ఈ క్రమంలో ఉపాధి పనులను గుర్తించిన అనంతరం వాటిని జియోట్యాగ్ ద్వారా యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పనులకు వచ్చే కూలీల వివరాలు సైతం ఇందులో పొందుపరచాలి. జియోట్యాగ్ చేసిన పనుల వద్దే కూలీల ఫొటోలను తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు.
దీనివల్ల ఇక అవకతవకలకు తావుండదని కేంద్రం నిర్ణయం. అంతేకాదు కూలీలకు వేతనాలు కూడా త్వరగా విడుదలవుతాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు సులభతరం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీల్లో యుక్తధార్ పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులను చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యుక్తధార్ యాప్కు అనుసంధానం చేసింది.
పనుల గుర్తింపు దగ్గర నుంచి బిల్లుల చెల్లింపు వరకూ అన్ని వివరాలు ఈ యాప్ ద్వారానే నడవనున్నాయి. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో అన్ని పంచాయతీల్లో ఈ యాప్ అమలు చేయనున్నారు.



