తిప్పాపురం గోశాలకు బీజేపీ నాయకులు

వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో కోడెల మృతిపై బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. కోడెలను సంరక్షించడంలో గోశాల సిబ్బంది, ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే ఇప్పటివరకు కోడెల సంరక్షణకు చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
తిప్పాపురం గోశాలను సందర్శించిన బీజేపీ నాయకులు ఇకపై కోడెల మృత్యు ఘోష ఆగకపోతే, గోశాలతోపాటు రాజన్న ఆలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజన్న గోశాలను పిక్నిక్ స్పాట్గా మార్చా రంటూ నిప్పులు చెరిగారు.
ఇక శుక్రవారం అనారోగ్యంతో నాలుగు కోడెలు మృతి చెందాయి. మరోవైపు అనారోగ్యంతో 12 కోడెలు బాధపడుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు గోశాలలో 30 కోడెలు మృతి చెందాయి. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజన్న ఆలయ గోశాలలో ప్రస్తుతం 1,300 కోడెలు ఉన్నాయి.
దీంతో గోశాలలోనే వెటర్నరీ డాక్టర్ల బృందం వాటి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రతిరోజు గోశాలను పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్. వైద్య సేవల వివరాలను స్వయంగా అడిగి ఆరా తీస్తున్నారు. అదేవిధంగా కోడెలకు దాణా, పచ్చిగడ్డిని పరిశీలిస్తున్నారు.