Pakistan-Afghanistan: కాల్పుల విరమణకు పాక్, అఫ్గాన్ అంగీకారం

Pakistan-Afghanistan: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తక్షణమే సీజ్ ఫైర్ ను పాటించాలని రెండు దేశాలూ అంగీకారానికి వచ్చాయి. ఖతర్ రాజధాని దోహాలో ఖతర్, తుర్కియే దేశాల మధ్యవర్తిత్వంతో పాక్, అఫ్గాన్ రక్షణ మంత్రుల బృందాలు భేటీ అయి చర్చలు జరిపాయి. చర్చల అనంతరం కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయని ఖతర్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
కాల్పుల విరమణ అమలు కొనసాగేలా చూసేందుకు, సరిహద్దు వెంబడి దీర్ఘకాలికంగా శాంతి నెలకొల్పడం కోసం తదుపరి సమావేశాలు నిర్వహించాలని కూడా ఇరుదేశాలూ అంగీకారానికి వచ్చాయని తెలిపింది. దోహా చర్చల్లో తమ దేశం నుంచి రక్షణ మంత్రి ముల్లా ముహ్మద్ యాకూబ్ నేతృత్వంలోని బృందం పాల్గొన్నదని అఫ్గాన్ ప్రకటించింది. తమ దేశం నుంచి రక్షణ మంత్రి ఖవాజా ముహ్మద్ అసిఫ్ నేతృత్వంలోని బృందం చర్చలకు హాజరైనట్టు పాకిస్తాన్ వెల్లడించింది.



