Virender Sehwag: విడాకులు తీసుకోబోతున్న వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఈసారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంతో వార్తల్లో నిలిచారు. తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు టాక్ వినబడుతోంది. తన భార్య ఆర్తి అహ్లావత్తో విడిపోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో వార్తలు గుప్పుమన్నాయి.
వీరేంద్ర సెహ్వాగ్ 2004 డిసెంబరులో ఆర్తి అహ్లావత్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు వైవాహిక బంధంలో ఉన్న వీరి మధ్య కొన్ని నెలల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం.
ఇక సెహ్వాగ్ చేసే ఇన్స్టా పోస్టుల్లో తన భార్య ఆర్తి కన్పించకపోవడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. గతేడాది దీపావళి పండుగ రోజు సెహ్వాగ్.. తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను పంచుకున్నారు. చివరిసారిగా 2023లో తమ పెళ్లి రోజు సందర్భంగా భార్యతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్తిని తన ఇన్స్టా ఖాతాలో అన్ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. అయితే.. ఈ వార్తలపై సెహ్వాగ్ నుంచి గానీ, ఆయన భార్య నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.